కేపీహెచ్ బీలో గజం 3 లక్షలా...
Vacant government plots in Kukatpally Housing Board Colony, Hyderabad have been auctioned.;
హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో స్థలాలు రికార్డు స్థాయి ధర పలికాయి. వేలంలో గజం ధర భారీగా పలకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని హౌజింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కేపీహెచ్బీ-హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కాలనీ ఫేజ్-7లో ఖాళీగా ఉన్న 18ప్లాట్లకు స్థానిక కమ్యూనిటీ హాల్ లో బుధవారం అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే రోడ్డులో హైటెక్ ఆర్వోబీ సమీపంలోని 151.92 గజాల 10వ నంబర్ ప్లాట్ గజం రూ.2.98లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తం 18 ప్లాట్లలో 13ప్లాట్లు గజం రూ.2లక్షలకుపైగా పలకగా.. ఐదు ప్లాట్లు గజం రూ.2లక్షలలోపు ధర పలికాయి.18వ నంబర్ ప్లాట్ అత్యల్పంగా రూ.1.14లక్షలకు అమ్ముడుపోగా.. 10 నెంబర్ ప్లాట్ అత్యధికంగా రూ. 2.98లక్షలు పలికింది. మొత్తం ప్లాట్లలో 17ప్లాట్లు కాలనీ ఏడో ఫేజ్ లోనివి కాగా.. ఒక్క ప్లాట్ మాత్రం కైత్లాపూర్ లో ఉంది.
అయితే, మొత్తం ప్లాట్ల విస్తీర్ణం 6,236.33 గజాలు కాగా.. వాటి వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 141,36,89,100 ఆదాయం సమకూరింది.ప్లాట్ల వేలంలో మొత్తం 84 మంది పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్లాట్ల వేలానికి ఈ స్థాయిలో డిమాండ్ రావటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఇది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ పెరుగుతున్నట్లు సూచిస్తుందని చెప్పారు. మరోవైపు కేపీహెచ్బీ ప్రాంతంలో స్థిరాస్తి విలువ ఎంతగా పెరిగాయో బుధవారం జరిగిన ప్రభుత్వం వేలంలో స్పష్టమైందని వ్యాపారులు పేర్కొంటున్నారు.