Abrar Ahmed: సన్‌రైజర్స్‌తో ఒప్పందం: విమర్శలపై పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ధీమా

విమర్శలపై పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ధీమా

Update: 2026-03-18 06:52 GMT

Abrar Ahmed: ఇండియన్ ఓనర్ల నేతృత్వంలోని 'సన్‌రైజర్స్ లీడ్స్' జట్టుకు ఆడబోతున్న పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, తనపై వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 'ద హండ్రెడ్' టోర్నీ కోసం అబ్రార్‌ను సుమారు రూ. 2 కోట్లకు (190,000 పౌండ్లు) సన్‌రైజర్స్ కొనుగోలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పాక్ ఆటగాళ్లకు ఇచ్చే డబ్బు పరోక్షంగా అక్కడి సైన్యానికి చేరుతుందని, అది భారత సైనికులపై దాడులకు కారణమవుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఇలాంటి ఆరోపణల వల్ల తనేమీ నిద్రపోకుండా ఆందోళన చెందడం లేదని అబ్రార్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-3లో ఉన్న అబ్రార్ అహ్మద్, తన ప్రతిభ ఆధారంగానే ఈ లీగ్‌లో చోటు సంపాదించుకున్నాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్స్ ఆడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, అందుకే రిజిస్టర్ చేసుకున్నానని అబ్రార్ చెబుతున్నాడు. సన్‌రైజర్స్ లీడ్స్ కోచ్ డానియల్ వెట్టోరి స్వయంగా అబ్రార్‌తో మాట్లాడి, ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు. తొలుత ఆదిల్ రషీద్‌ను తీసుకోవాలనుకున్నా, అది కుదరకపోవడంతో అత్యుత్తమ స్పిన్నర్ అయిన అబ్రార్‌ను ఎంచుకున్నట్లు వెట్టోరి స్పష్టం చేశారు.

మరోవైపు, భారత ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను దూరం పెడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో.. కేవలం జాతీయతను బట్టి ఆటగాళ్లను పక్కనపెడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) హెచ్చరించింది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే, పాక్ మాజీ అండర్-19 కెప్టెన్ అజీమ్ రఫీక్ వంటి వారు గవాస్కర్ మాటలను తప్పుబట్టారు. ఇవి అత్యంత అసహ్యకరమైన వ్యాఖ్యలని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఏది ఏమైనా, అబ్రార్ మాత్రం ఈ వివాదాలను పక్కనపెట్టి మైదానంలో తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు.

Tags:    

Similar News