Asia Cup T20: ఆసియా కప్ టీ20.. బరిలోకి బుమ్రా.. ప్రాక్టీస్ట్ స్టార్ట్ చేసి సూర్య

ప్రాక్టీస్ట్ స్టార్ట్ చేసి సూర్య;

Update: 2025-08-12 12:51 GMT

Asia Cup T20: ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వచ్చే నెల యూఏఈలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నాడు. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టులో అతడికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. భారత ఆటగాళ్ల వైద్య నివేదికలు అందిన తర్వాత ఈనెల 19 లేదా 20న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.

కెప్టెన్, వైస్ కెప్టెన్సీపై ఉత్కంఠ:

టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సెలక్టర్లు అతని ఫిట్‌నెస్‌ను కూడా పర్యవేక్షించనున్నారు. ఆసియా కప్‌లో వైస్ కెప్టెన్సీ కోసం శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా గిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడు వైస్ కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఈ బాధ్యతలను అక్షర్ పటేల్ సమర్థవంతంగా నిర్వర్తించాడు. గతంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సూర్యకుమార్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

జట్టు కూర్పుపై చర్చ:

బ్యాటింగ్ లైనప్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉండే అవకాశం ఉంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఉండగా, సంజు శాంసన్ బ్యాటర్‌గా, కీపర్‌గా రాణించాడు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, ఐపీఎల్‌లోనూ సత్తా చాటడంతో సెలక్టర్లకు ఎంపిక కష్టంగా మారింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌లకు ప్రస్తుత జట్టులో చోటు దొరకడం కష్టమే. వన్డేల్లో ప్రధాన కీపర్ కేఎల్ రాహుల్‌కు స్థానం అనుమానమే. కీపర్‌గా సంజు శాంసన్ ఖాయం కాగా, రెండో కీపర్‌గా జితేశ్ శర్మ లేదా ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది.

పేస్ ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉండగా.. గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనకు రాకపోవచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టులో స్థానం దక్కించుకునే అవకాశాలున్నాయి. పేస్ విభాగంలో బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ దాదాపు ఖాయం. మూడో సీమర్‌గా ఐపీఎల్-18లో 25 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ పోటీలో ఉన్నాడు. హర్షిత్ రాణాకు అవకాశం కష్టమే. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తుది జట్టును ప్రకటించనుంది.

Tags:    

Similar News