జాతీయ అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వండి
కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియాను కోరిన సీయం రేవంత్ రెడ్డి;
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఏవైనా తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మాండవియాని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీయం రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర మంత్రి మాండవియాను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఖేలో ఇండియా గేమ్స్, 40వ జాతీయ క్రీడలు, లేదా ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని సీయం కేంద్ర మంత్రిని కోరారు.
అలాగే, ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్రీడా విభాగం ప్రభుత్వ సలహాదారు ఏపీజితేందర్ రెడ్డిలు కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియాను కలిసిన వారిలో ఉన్నారు.