ప్లే ఆఫ్స్ గేట్ మూసుకున్నాక సన్ రైజర్స్ జోరు
ప్లేఆఫ్స్కు గేట్స్ క్లోజ్ అయ్యాక... సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ అదరగొడుతోంది. గత మ్యాచ్లో లఖ్నవూను మట్టికరిపించిన కమిన్స్ సేన.. ఇప్పుడు బెంగళూరుపై 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ (94; 48 బంతుల్లో 7×4, 5×6), అభిషేక్ శర్మ (34; 17 బంతుల్లో 3×4, 3×6) మెరుపులతో మొదట హైదరాబాద్ 6 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. రొమారియో షెఫర్డ్ (2/14) మినహా ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు. అనంతరం బెంగళూరు 19.5 ఓవర్లలో ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (62; 32 బంతుల్లో 4×4, 5×6), విరాట్ కోహ్లి (43; 25 బంతుల్లో 7×4, 1×6) జట్టుకు బలమైన పునాదే వేసినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. కమిన్స్ (3/28), ఇషాన్ మలింగ (2/37), నితీశ్ కుమార్రెడ్డి (1/13), హర్ష్ దూబె (1/20) బెంగళూరును కట్టడి చేశారు.
230 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన ఆరంభమే దక్కింది ఆర్సీబీకి. మొదట కోహ్లి, ఆ తర్వాత సాల్ట్ చెలరేగి ఆడి టార్గెట్ అచీవ్మెంట్కోసం టీమ్కు బలమైన పునాది వేశారు. కానీ, వీరి స్థాయిలో మిగతా బ్యాటర్లు ఆడకపోవడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. కొన్ని మ్యాచ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన సాల్ట్.. మొదట్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. హర్షల్ బౌలింగ్లో బౌండరీ వద్ద క్చ్ అవుట్ అయినప్పటికీ అది నోబాల్ కావడంతో సాల్ట్ బతికిపోయాడు. అయితే, మరో ఎండ్లో కోహ్లి మాత్రం ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో, 5 ఓవర్లకే స్కోరు 55కు చేరుకుంది. కోహ్లి 41 పరుగులకు చేరుకున్నప్పటికి.. సాల్ట్ 10 పరుగులే చేయడం గమనార్హం. కానీ, తర్వాత సాల్ట్ చెలరేగిపోయాడు. అంతలో కోహ్లి అవుట్ అవడంతో ఆర్సీబీకి ఎదురు దెబ్బ తగిలింది. అయినా సాల్ట్ తగ్గలేదు. ఇంకా దూకుడు పెంచి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మయాంక్ (11) ఎక్కువసేపు నిలవకపోయినా 11 ఓవర్లకే స్కోరు 127కు చేరుకోవడం, సాల్ట్ క్రీజులోనే ఉండడంతో ఆర్సీబీకి మెరుగైన అవకాశాలే కనిపించాయి. కానీ, తర్వాతి ఓవర్లో కమిన్స్.. సాల్ట్ను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఈ స్థితిలో జితేశ్ శర్మ, రజత్ పాటీదార్ కొన్ని ఓవర్ల పాటు నిలిచారు కానీ.. సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. ఈ ఇద్దరితో పాటు రొమారియో షెఫర్డ్ (0).. 5 బంతుల వ్యవధిలో ఔటైపోవడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ డేవిడ్ (1).. పరుగులు తీయలేని స్థితిలో బ్యాటింగ్కు వచ్చి ఒక్క బౌండరీ కూడా కొట్టకుండానే వెనుదిరిగాడు. ఒక దశలో 173/3తో ఉన్న ఆర్సీబీ.. కేవలం 16 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయి 189కే ఆలౌటైంది.
ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్లో 200 పైచిలుకు టార్గెట్ను ఛేదించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి 230 ప్లస్ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గాయం నుంచి కోలుకుంటున్న రజత్ పాటీదార్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో ఈ మ్యాచ్కు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన జితేశ్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయంపై చింతించేలా మొదలైన సన్రైజర్స్ ఇన్నింగ్స్. అభిషేక్ శర్మ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడడంతో ఆరంభ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లకు దిక్కుతోచలేదు. 3.3 ఓవర్లకే స్కోరు 50కి చేరుకుంది. కానీ అదే ఓవర్లో ఎంగిడి బౌలింగ్లో.. అభిషేక్ ఔటైపోవడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. భువనేశ్వర్ వేసిన తర్వాతి ఓవర్లో హెడ్ (17) కూడా అవుటైపోయాడు. అయితే, సీజన్ తొలి మ్యాచ్లో సెంచరీ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడని ఇషాన్ కిషన్.. ఈ మ్యాచ్లో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్లో అతను భారీ షాట్లు ఆడాడు. క్లాసెన్ (24; 13 బంతుల్లో 2×4, 2×6), అనికేత్ వర్మ (26; 9 బంతుల్లో 1×4, 3×6)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఇషాన్.. స్కోరును 200 దాటించాడు. సన్రైజర్స్ ప్రధాన బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి (4) మినహా అందరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు.