T20 World Cup 2026: న్యూజిలాండ్ చేతిలో చిత్తు.. శ్రీ లంక ఖేల్ ఖతం
శ్రీ లంక ఖేల్ ఖతం
T20 World Cup 2026: సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో బోల్తా కొట్టిన ఆతిథ్య శ్రీలంక టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. రచిన్ రవీంద్ర (22 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 32; 4/27) ఆల్రౌండ్ పెర్ఫామెన్స్కు తోడు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (26 బాల్స్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 47), కోల్ మకొంచి (31 నాటౌట్) మెరుపులతో బుధవారం జరిగిన సూపర్–8 గ్రూప్–2 మ్యాచ్లో న్యూజిలాండ్ 61 రన్స్ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరగా మరో బెర్తును కివీస్ దాదాపుగా ఖాయం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది. ఓపెనర్ టిమ్ సిఫర్ట్ (8) త్వరగానే ఔటైనా.. ఫిన్ అలెన్ (23), రచిన్ మూడో వికెట్కు 41 రన్స్ జోడించారు. స్పిన్నర్ మహేశ్ తీక్షణ (3/30), పేసర్ దుష్మంత చమీర (3/38) దెబ్బకు 9.3 ఓవర్ల నుంచి 12.1 ఓవర్ల మధ్య కివీస్ 9 రన్స్ వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి 84/6తో కష్టాల్లో పడింది.
కెప్టెన్ శాంట్నర్, మకొంచి మిడిల్ ఓవర్లలో లంక బౌలర్లకు ఎదురొడ్డినా..16 ఓవర్లకు ఆ జట్టు 98/6 స్కోరుతో నిలిచింది. చివరి నాలుగు ఓవర్లలో భారీ షాట్లతో విజృంభించిన శాంట్నర్, మకొంచి వరుసగా 18, 21, 19, 12 రన్స్ రాబట్టారు. ఏడో వికెట్కు 47 బాల్స్లో 84 రన్స్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేజింగ్లో రచిన్, మాట్ హెన్రీ (2/3) దెబ్బకు లంక ఓవర్లన్నీ ఆడి 107/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే ఇన్ఫామ్ బ్యాటర్ నిశాంక (0)ను బౌల్డ్ చేసిన హెన్రీ తన తర్వాతి ఓవర్లో చరిత్ అసలంక (5)ను ఔట్ చేసి షాకివ్వగా.. అక్కడి నుంచి లంక కోలుకోలేకపోయింది. రచిన్ స్పిన్ దెబ్బకు కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), కెప్టెన్ దసున్ షనక (3), దుషన్ హేమంత (3) పెవిలియన్కు క్యూ కట్టారు. మరో ఎండ్లో ఒంటరి పోరాటం చేసిన కమిందు మెండిస్ (31)ను 15వ ఓవర్లో శాంట్నర్ ఔట్ చేయడంతో లంక ఓటమి ఖాయమైంది. వెల్లలాగే (29) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. రచిన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.