Test Series Clean Sweep: టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌..విండీస్‌పై భారత్ ఘనవిజయం..

విండీస్‌పై భారత్ ఘనవిజయం..

Update: 2025-10-14 05:58 GMT

Test Series Clean Sweep: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండి 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌, ఆఖరి రోజు ఆటలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. 63/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. కేఎల్‌ రాహుల్‌ (58, 108 బంతుల్లో) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. సాయి సుదర్శన్‌ (39, 76 బంతుల్లో) కూడా రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం అందించారు. శుభ్‌మన్‌ గిల్ (13) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా, చివర్లో ధ్రువ్‌ జురెల్‌ (6) నాటౌట్‌గా నిలిచి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ 2, జోమెల్‌ వారికన్‌ ఒక వికెట్‌ తీశారు. నాలుగో రోజు ఆటలోనే యశస్వి జైస్వాల్ (8) ఔటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిపత్యం

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 518/5 వద్ద డిక్లేర్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (175) సెంచరీ, శుభ్‌మన్‌ గిల్‌ (129) సెంచరీతో పాటు ధ్రువ్‌ జురెల్‌ (44), నితీశ్‌ రెడ్డి (43) రాణించారు. బౌలింగ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ (5/82) ఐదు వికెట్లు, రవీంద్ర జడేజా (3/46) మూడు వికెట్లతో విజృంభించడంతో వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్‌లో పడింది.

వెస్టిండీస్‌ పోరాటం వృథా

అయితే, రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్‌ జట్టు అద్భుతంగా పోరాడింది. కంప్‌బెల్‌ (115), షై హోప్‌ (103) సెంచరీలకు తోడు జస్టిన్‌ గ్రీవ్స్‌ (50), రోస్టన్‌ ఛేజ్‌ (40), జైడెన్‌ సీల్స్‌ (32) రాణించడంతో విండీస్‌ 390 పరుగులు చేసింది. అయినప్పటికీ, భారత విజయాన్ని ఆపలేకపోయింది.

Tags:    

Similar News