Vijay Mallya Cheers for Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. శనివారం (మార్చి 28) ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరుకు కొన్ని గంటల ముందు ఆర్సీబీ మాజీ బాస్ విజయ్ మాల్యా జట్టులో ఉత్సాహం నింపేలా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

నమ్మ సింహాలు.. ప్లే బోల్డ్!

మాల్యా తన ట్వీట్‌లో.. "మన బెంగళూరు సింహాలకు.. నమ్మ సింహాలు.. ఐపీఎల్ ఛాంపియన్లకు సమయం ఆసన్నమైంది. గుడ్ లక్.. ప్లే బోల్డ్.. ధైర్యంగా ఆడండి (Dhairyadinda ațavadi)" అంటూ కన్నడ పదాలను జోడిస్తూ జట్టును ఉత్సాహపరిచారు. ఆర్సీబీ యాజమాన్యం మారినప్పటికీ, తన పాత జట్టుపై మాల్యా చూపిస్తున్న ఈ అభిమానం అభిమానులను ఆకట్టుకుంటోంది.

కొత్త యజమానులకు అభినందనలు:

రెండు రోజుల క్రితమే ఆర్సీబీ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్ మరియు బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ సంస్థల కన్సార్టియం సుమారు 1.78 బిలియన్ డాలర్ల (దాదాపు ₹15,000 కోట్లు) భారీ ధరతో ఆర్సీబీని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త యజమానులకు కూడా మాల్యా అభినందనలు తెలుపుతూ, ఆర్సీబీ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఎదగాలని ఆకాంక్షించారు.

విషాదం నీడలో వేడుకలు:

గత ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలిచిన సమయంలో జరిగిన సంబరాల్లో, స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మరణించిన ఘటన ఇంకా అందరినీ కలచివేస్తోంది. ఆ విషాద జ్ఞాపకాల మధ్యే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ ఈ ఏడాది బరిలోకి దిగుతోంది. అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం 'ఈసారీ కప్ మనదే' అంటూ భారీ అంచనాలతో ఉన్నారు.

Tags: