బనకచర్లపై తెలంగాణ ఎంపీలతో అఖిలపక్ష సమావేశం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం;
తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు అఖిలపక్ష పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశానికి తెలంగాణ ఎంపీలందరూ హాజరు కావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సైతం హాజరుకానున్నారు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందనే అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లను కూడా ఆహ్వానిస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, ఆర్థికమంత్రిత్వ శాఖకు సమర్పించిందని మంత్రి తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుతో పాటు ఏపీ పునర్ వ్యవస్ధీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లవుతందన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రభావితం చేస్తుందని ఉత్తమ్ అంటున్నారు. తెలంగాణ ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఐకమత్యంతో ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.