పసుపు బోర్డు ప్రారంభానికి అమిత్ షా
తెలంగాణ పసుపు రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా పసుపు బోర్డు త్వరలో ప్రారంభం కానుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలసి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. కార్యాలయ ప్రారంభోత్సవ అధికారిక ఆహ్వాన పత్రాన్ని ఎంపీ అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డిలు అమిత్ షాకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కచ్చితైన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ సైతం ఈ విషయంలో తనవంతు పాత్రను పోషిస్తోంది. నిజామాబాద్ లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ, ప్రపంచ మార్కెట్ అందుబాటులోకి తెచ్చే కొత్త శకానికి ప్రతీకగా ఈ లోగో ఉండనుందని ఎంపీ అర్వింద్ తెలిపారు. ఈ బోర్డు ప్రధానంగా పసుపు సాగుదారులకు ఒక మలుపుగా నిలువనుందని అర్వింద్ అన్నారు.