తెలంగాణ ప్రజలకు బీజేపీనే ప్రత్యామ్నయం
స్థానిక సంస్ధల ఎన్నికలపై వర్క్ షాపులో బీజేపీ నేతలు;
పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన కాంగ్రెస్ ఒక వైపు… ప్రతిపక్షంగా విఫలమైన బీఆర్ఎస్ ను మరో వైపు చూసిన తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్ర మత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్ధల ఎన్నికలపై శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో ఆయనతో పాటు తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ లు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీసు బ్యారర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లను చూసి తెలంగాణ ప్రజలు క్రాస్ రోడ్స్లో ఉన్నారని ఈ సమయంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో వార్డ్ సభ్యుడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకూ పార్టీ ఫోకస్ చేయాలని సూచించారు. అన్ని స్ధానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ అమలు దిశగా బీజేపీ పోరాటం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరి ఫోన్లు ట్యాప్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పంద చేసుకున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మనం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఐకమత్యం, నిబద్దతతో మనం ప్రత్యామ్నయ శక్తిగా ఎదగాలని పేర్కొన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళమని బీజేపీ శ్రేణులకు సూచించారు. ఈ నెల 25వ తేదీన ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రలో కొత్త నాయకత్వం వచ్చాక జిల్లా కమిటీలు వేస్తారని ఈవర్క్ షాపులో ఢిల్లీ బీజేపీ నాయకులు తెలిపారు.