ఇకపై నెలకు రెండుసార్లు కేబినెట్ మీటింగ్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా రంగానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండు సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది. అంటే.. ఇప్పటినుంచి ప్రతి పదిహేను రోజులకోసారి కేబినెట్ సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనలో భాగంగా.. విధాన పరమైన నిర్ణయాల్లో ఆలస్యం లేకుండా వేగం పెంచాలన్న ఉద్దేశ్యంతో, ఎప్పటికప్పుడు వాటిని రివ్యూ చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెండు మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా మంత్రివర్గంలో సమీక్ష చేయాలని నిర్ణయించారు. ఆయా అంశాలపై మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రతి నెలా మొదటి, మూడవ శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత యేడాదిన్నర కాలంలో ఇప్పటివరకు 17 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి.