CM Revanth Reddy : అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లు త్వరగా పూర్తి చేయండి
ఏటీసీల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీయం రేవంత్ రెడ్డి;
నిర్దేశిత సమయానికి వీలైనంత త్వరగా ఆడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లను పూర్తి చేసి వాటిలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏటీసీల ఏర్పాటు పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ - 2047కు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లను రాష్ట్రం నలుమూలలా ఏర్పాటు చేయాలని సీయం అధికారులకు సూచించారు. అన్ని ఏటీసీ సెంటర్లలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పలు కోర్సుల్లో శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై తాను త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్న సీఎం అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు సీయం దృష్టికి తీసుకు వచ్చారు. మొదటి దశలో 25 ఏటీసీలు, రెండొవ దశలో 40 ఏటీసీలు, మూడొవ దశలో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు సీయంకు వివరించారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సీయం చెప్పారు. రాష్ట్రంలో ఏటీసీలు ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.