CM Revanth Reddy: వికారాబాద్లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ... నాపై కేసులు పెట్టినా పోరాడా
నాపై కేసులు పెట్టినా పోరాడా
CM Revanth Reddy: భారాస పాలన కాలంలో తనపై అనేక కేసులు నమోదు చేసి, పరువునష్టం దావాలు వేసినప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని, నిరంతరం పోరాడానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం కూడా కోర్టుకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. వికారాబాద్లోని హరితరిసార్ట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ, తన 19 ఏళ్ల రాజకీయ జీవితంలో జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థానం వరకు ఎదిగానని, పీసీసీ అధ్యక్ష పదవి కూడా పొందానని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తనకు బాగా ఉపయోగపడిందని, ఎప్పుడూ ఫైరవీలు చేయలేదని, ప్రజా సమస్యలపై గట్టిగా గళం వినిపించానని చెప్పారు. సోనియాగాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించారు.
దేశంలో అనేక సమస్యలపై పోరాటాలు చేసినందువల్లే రాహుల్గాంధీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారని, ఆయనే దేశ ప్రధానిగా ఉండాలనేది తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. డీసీసీ అధ్యక్షులే భవిష్యత్తులో పార్టీలో కీలక స్థానాలకు వస్తారని, వారికి ఎమ్మెల్యే, మంత్రి, సీఎం అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడితేనే గుర్తింపు వస్తుందని దిశానిర్దేశం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ, డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల శిక్షణ ఇవ్వడం చరిత్రాత్మకమని, రాహుల్గాంధీ పాల్గొనడం మరింత ప్రత్యేకతను ఇచ్చిందని అన్నారు. తెలంగాణలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, దేశంలో వందేళ్లలో ఎవరూ చేయని కులగణన నిర్వహించి, బీసీ రిజర్వేషన్లు పెంచే బిల్లును అసెంబ్లీలో ఆమోదించామని తెలిపారు. భాజపా, భారాసలు కుట్రలు చేసినా, పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి గెలిపించామని, అనేక జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టిన ఘనత కాంగ్రెస్దేనని చెప్పారు. ఇదంతా రాహుల్గాంధీ చొరవతోనే జరిగిందని కొనియాడారు. త్వరలో అన్ని జిల్లాల కమిటీల నియామకాలు పూర్తి చేసి పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
శిబిరంలో రాహుల్గాంధీ డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులతో విడివిడిగా ఫొటోలు దిగారు. గతంలో ఇలా ఎవరి కుటుంబాలతో ఫొటోలు దిగలేదని, ఇప్పుడు చేస్తున్నానంటే డీసీసీ అధ్యక్షులకు ఎంత ప్రాధాన్యమిస్తున్నానో అర్థం చేసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఏపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
శిబిరానికి ముందు రాహుల్గాంధీ ఏపీ, తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీల నేతలతో సమావేశమై మాట్లాడారు. పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో మమేకం, ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజాసమస్యల పరిష్కారాలు, సోషల్ మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలు వంటివి శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడింది.