Former Minister KTR: మాజీ మంత్రి కేటీఆర్: ఎలాంటి అక్రమాలు జరగలేదు.. నేను లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం
నేను లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం
Former Minister KTR: ఫార్ములా-ఈ రేసు కేసులో గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టమైన స్పందన తెలిపారు. ఈ కేసులో ఎలాంటి తప్పు జరగలేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఈ కేసులో ఏమీ లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను అరెస్టు చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉండదు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో ఎలాంటి అక్రమం జరగలేదు. నేను వందసార్లు చెప్పాను – లై డిటెక్టర్ టెస్ట్కు కూడా సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలో కాంగ్రెస్-భాజపా జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోంది. దేశంలో ఇంత అక్రమ ఒడంబడిక మరెక్కడా లేదు’’ అని విమర్శించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత రాకుండా కాపాడేందుకు రాజీనామాలకు అవకాశమిస్తున్నారని ఆరోపించారు. ‘‘దానం నాగేందర్ను రాజీనామా చేయిస్తారు. మా వాళ్లకు కూడా అదే చెప్పారు. కడియం శ్రీహరిని సాంకేతిక కారణాలతో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద భూకుంభకోణానికి తెరలేపిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పదేళ్లు మంత్రిగా ఉన్న నేను భూముల కోసం వచ్చిన వారిని ఎప్పుడూ అంగీకరించలేదు. డబ్బులిచ్చినా భూమార్పిడి చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో భారీ భూకుంభకోణం సృష్టించింది. అజమాబాద్ భూముల క్రమబద్ధీకరణకు మా హయాంలో 100 శాతం రుసుము వసూలు చేశాం. ఇతరుల చేతిలో ఉంటే 200 శాతం పెట్టాం. ఇప్పుడు కేవలం 30 శాతం చెల్లిస్తేనే క్రమబద్ధీకరణ అని చౌకగా భూములు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. 9,292 ఎకరాలు ఎవరివో సంతర్పణ చేసుకుంటున్నారు? ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
భూముల విషయంలో న్యాయపోరాటం చేస్తామని, కొనుగోలుదారులు చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. ‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. రేవంత్ కుట్రలో పడితే నష్టపోతారు. మా హయాంలో ఇలాంటి అక్రమాలు ఎప్పుడూ జరగలేదు. అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదలబోము. ఇది రూ.5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణం. రూ.50 వేల కోట్లు వెనకేసుకోవాలని రేవంత్ చూస్తున్నారు. భాజపా నేతలు కూడా దీన్ని అడ్డుకోవాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.