Hyderabad’s Drinking Water: హైదరాబాద్ తాగునీటి అవసరాలకు గోదావరి జలాలు
తాగునీటి అవసరాలకు గోదావరి జలాలు
Hyderabad’s Drinking Water: హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు, మూసీ నది పునరుజ్జీవనం కోసం గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,360 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొస్తుంది. ఇందులో 17.50 టీఎంసీలు తాగునీటికి, మిగిలిన 2.50 టీఎంసీలు మూసీ పునరుజ్జీవనానికి ఉపయోగిస్తారు.
ప్రాజెక్టు వివరాలు
నిధులు: హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో నిర్మాణం. 60% (రూ.4,416 కోట్లు) నిర్మాణ సంస్థలు, 40% (రూ.2,944 కోట్లు) జలమండలి హడ్కో రుణంగా సమకూర్చనుంది. నిర్మాణ సంస్థ పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది.
నీటి సరఫరా: ప్రస్తుతం హైదరాబాద్కు రోజుకు 550 ఎంజీడీ తాగునీరు సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టుతో మరో 307 ఎంజీడీలు అందుబాటులోకి వస్తాయి.
నీటి తరలింపు: మల్లన్నసాగర్ నుంచి 3000 ఎంఎం డయామీటర్ ఎంఎస్ పైపులైన్ల ద్వారా 20 టీఎంసీల నీటిని ఘన్పూర్కు తరలిస్తారు. ఘన్పూర్లో 1170 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తారు.
శుద్ధి చేసిన నీరు: ఘన్పూర్ నుంచి 2400 ఎంఎం డయామీటర్ పైపులైన్ ద్వారా ముత్తంగి జంక్షన్కు శుద్ధి చేసిన నీటిని తీసుకెళతారు. అక్కడి నుంచి 3000 ఎంఎం పైపులైన్ ద్వారా పశ్చిమ హైదరాబాద్కు సరఫరా చేస్తారు.
ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్: 5 టీఎంసీల నీటిని 2200 ఎంఎం పైపులైన్ ద్వారా ఈ రిజర్వాయర్లకు తరలిస్తారు. ఉస్మాన్సాగర్ వద్ద 120 ఎంఎల్డీ, హిమాయత్సాగర్ వద్ద 70 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మిస్తారు.
మూసీ పునరుజ్జీవనం: 2.5 టీఎంసీల శుద్ధి చేయని నీటిని మూసీ నది పునరుజ్జీవనానికి ఉపయోగిస్తారు.