తెలంగాణ రాజకీయాల్లో దేవుళ్లు, దెయ్యాలు
తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి పార్టీలో ఇప్పుడు దేవుడు, దయ్యాల చర్చ జరుగుతోంది. ఆ పార్టీలో దేవుడెవరో కల్వకుంట్ల కవిత క్లియర్గా చెప్పేశారు. కానీ, దెయ్యం ఎవరన్న అంశంపై సస్పెన్స్ పెట్టారు. ఎవరి పేర్లు చెప్పుకుండా దెయ్యాలంటూ నేరుగా విమర్శలు చేశారు. ఇప్పుడీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అమెరికాలో కొడుకు గ్రాడ్యుయేషన్ డే కోసం కల్వకుంట్ల కవిత వెళ్లారు. అక్కడ కొడుకుతో కలిసి ఫోటోలు దిగారు. ఆ వేడుకను గురించి ప్రస్తావిస్తూ కుమారుడిని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ, యాదృచ్ఛికంగా గులాబీ క్యాంపు నుంచి ఎటువంటి ప్రశంసలు కవిత పోస్టుకు దక్కలేదు. కానీ, ఆమె తిరిగి హైదరాబాద్కు వచ్చే సరికే తన తండ్రికి కవిత రాసిన లెటర్ బయటకు వచ్చింది. దీంతో, గులాబీ పార్టీలో ఒక్కసారిగా కలకలం నెలకొంది.
ఇక, శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే.. కవితను విలేకరులు చుట్టుముట్టారు. వాళ్లు ఏం అడుగుతారో కవితకు తెలుసు. పైగా తన మనసులో ఎలాంటి భావం ఉందో కూడా ఆమెకు తెలుసు. అందుకనే నేరుగా చెప్పేశారు. "ఆ లెటర్స్ రాసింది నేనే. కానీ అది ఇంటర్నల్ మేటర్. అలాంటి లెటర్స్ లీక్ చేసింది ఎవరో మీరే ఇమాజిన్ చేసుకోండి. కేసీఆర్ దేవుడు లాంటి వ్యక్తి. కానీ, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ లీడర్ షిప్ లోనే పనిచేస్తాను. నాకు వేరే వ్యాపకాలు లేవు. పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ గురించి ఇలాంటి లెటర్స్ రాయడం మాకు కామనే. కానీ, ఈసారి మాత్రమే బయటికి వచ్చింది. కానీ, ఈ లెటర్స్ ని చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎగిరి ఎగిరి పడుతున్నారు. కోతికి కొబ్బరి కాయ దొరికినట్టుగా వారు సంబర పడాల్సిన అవసరం లేదు " ఇవీ విలేకరులతో కవిత మాట్లాడిన మాటలు.
వాస్తవానికి రెండు రోజులుగా కేసీఆర్కు కవిత రాసిన లెటర్పై విపరీతమైన చర్చ జరుగుతూనే ఉంది.. కేసీఆర్ క్యాంపు ఆఫీసు నుంచి ఒక్క ఖండన కూడా రాలేదు. కవిత వర్గాల నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ రాలేదు. దాసోజు శ్రవణ్ లాంటి కొంతమంది నాయకులు స్పందించినప్పటికీ.. అధికారికంగా గులాబీ పార్టీ నుంచి ఎటువంటి ఖండనలు రాలేదు. అయితే, కవితపై కేసీఆర్ కు కోపం ఉందని, కేటీఆర్ కూడా అలానే ఉన్నాడని.. శంషాబాద్ లో శుక్రవారం చోటుచేసుకున్న పరిస్థితులు చెబుతున్నాయి.
కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత శంషాబాద్ ప్రాంతానికి గులాబీ పార్టీ నాయకులు రాలేదు. అక్కడ గులాబీ పార్టీ జెండాలు కనిపించలేదు. కేటీఆర్, ఇతర నాయకుల ప్రస్తావన కనిపించలేదు. కేవలం జాగృతి నాయకులు, లీడర్లు మాత్రమే అక్కడ కనిపించారు. టీమ్ కవిత అనే పేరుతో కొన్ని ప్లకార్డులు కనిపించాయి. మొత్తంగా చూస్తే పార్టీ పరంగా ఆమెకు దూరంగా ఉండాలని కేసీఆర్ క్యాంప్ నుంచి ఆదేశాలు వచ్చాయని అనుకోవాలా? కేసీఆర్ దేవుడైతే ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? కవిత ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? కేసీఆర్ కోటరీలోకి వెళ్లే ధైర్యం కేటీఆర్, హరీష్ రావుకు మాత్రమే ఉంటుంది. మహా అయితే సంతోష్ రావు కొంత పరిధిలోకి వెళ్ళగలడు. అలాంటప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? హరీష్ రావు తో కవితకు విభేదాలు లేవు. అంటే ఒక రకంగా కవిత పొలిటికల్ గ్రోత్కు కేటీఆర్ అడ్డుపడుతున్నాడా? అందువల్లే ఆమె రాసిన లెటర్ బయటకు వచ్చిందా? అంటే సోదరుడితో ఉన్న ఆగాధం కాస్త పెరుగుతున్నట్టే భావించాలా? కానీ కవిత వ్యాఖ్యలతో ఒక స్పష్టత వచ్చినట్టు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఇది గనుక కేసీఆర్ కుటుంబం ఆడుతున్న నాటకం అయితే.. దానికి కాలమే సమాధానం చెబుతుంది. మొత్తానికి కవిత వేస్తున్న అడుగులు.. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు.. ఆలోచనలు జనానికి ఒక క్లారిటీ ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె సామాజిక తెలంగాణ సాధించుకోలేక పోయామని తండ్రికి ఒక రకమైన హెచ్చరిక పంపింది. ఇప్పుడేమో దయ్యాల ప్రస్తావని తీసుకొచ్చింది. మొత్తంగా కేసీఆర్ అనే వ్యక్తి నీడ నుంచి దూరంగా జరిగి.. సొంతంగా తన రాజకీయ కార్యశాలను నిర్మించుకోబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.