Heli Tourism : తెలంగాణలో త్వరలో హెలీ టూరిజం
వెల్నెస్ & స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ కు మంత్రి జూపల్లి శంకుస్థాపన;
- హైదరాబాద్ - సోమశిల - శ్రీశైలం మధ్య సేవలు
- ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం
త్వరలోనే తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్ కు హెలి టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రూ. 68.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం శ్రీకారం చుట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో అమరగిరిలో రూ. 45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ నిర్మాణ పనులు, రూ. 1.60 కోట్లతో సోమశిల విఐపీ ఘాట్ బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు మంత్రి జూపల్లి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పర్యాటక ఆతిథ్యానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందిని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాటక ప్రాజెక్ట్ లు చేపడుతోందన్నారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గత పదేండ్లలో టూరిజం నిర్లక్ష్యానికి గురైందని మంత్రి చెప్పారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
నీటి ప్రవాహం తగిన, పర్యాటకులను ఐలాండ్ తీసుకువచ్చేలా ఫ్లోటింగ్ జెట్టి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. కొత్త పర్యాటక ప్రాజెక్ట్ ల అభివృద్ధి వల్ల పర్యాటకుల సందర్శన మరింత పెరగతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.