Former Minister T. Jeevan Reddy: జీవన్‌రెడ్డి: అవమానాలు భరించలేక కాంగ్రెస్‌ను వీడుతున్నా..

కాంగ్రెస్‌ను వీడుతున్నా..

Update: 2026-03-26 12:55 GMT

ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం.. అసలైన కార్యకర్తలకు అన్యాయం

Former Minister T. Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీలో గత 20 నెలలుగా తనకు జరుగుతున్న అవమానాలు భరించలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం జగిత్యాలలో తన అనుచరులు, మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు.

నాలుగు దశాబ్దాలకు పైగా (42 ఏళ్లు) కాంగ్రెస్‌కు సేవలందించిన తర్వాత పార్టీని వీడడం బాధాకరమే అయినప్పటికీ, అధికారంలో ఉన్నా జెండా మోసిన అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుండటంతో బయటకు రాక తప్పలేదని జీవన్‌రెడ్డి అన్నారు.

రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నప్పటికీ, రాష్ట్ర నాయకత్వం ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ, పార్టీ కోసం కష్టపడిన వారికి నష్టం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు తాను ఎమ్మెల్సీగా ఉన్నానని, మండలిలో పార్టీ తరఫున ఏకైక సభ్యుడిగా ఉన్నా మంత్రి పదవికి అర్హుడిని కాదా అని ప్రశ్నించారు. అయినా రెండున్నరేళ్లలో ఏ పదవి ఆశించలేదని స్పష్టం చేశారు.

భారాస (బీఆర్‌ఎస్)కు చెందిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొని అసలైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. 2024 అక్టోబరులో నియోజకవర్గ పరిస్థితులపై లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు.

జీవన్‌రెడ్డి తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఆయన రాజీనామా పత్రాన్ని అనుచరులకు చూపించారు.

జగిత్యాల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆయన రాజీనామా తర్వాత తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై అనుచరులు త్వరలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. జీవన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News