K. Kavitha: పాఠశాల ఫీజుల దోపిడీని అరికట్టాలి..ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత
K. Kavitha: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని, తమ పోరాటం కూడా కాంగ్రెస్తోనే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
ఎక్కడి నుంచి పోటీ చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదని, సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్ అమలు అయితే గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయవచ్చన్నారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానం విషయంలో సీఎం రేవంత్రెడ్డి, హరీశ్రావు మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు.
బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం అనంతరం చిట్చాట్లో కవిత మాట్లాడారు. ‘‘గతంలో రేవంత్రెడ్డి మహారాష్ట్ర, బిహార్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు కేరళలో కూడా అదే ఫలితం వస్తుంది. కేరళ ప్రజలకు ఆరు గ్యారంటీల అమలు గురించి చెప్పడం విడ్డూరంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్లు తమ పార్టీకి గొప్ప అవకాశం అని, ఆడబిడ్డకు ఓటు వేయాలనే భావోద్వేగం ఉంటుందని కవిత అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఒకేసారి 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.