కాళేశ్వరం విచారణ - కాంగ్రెస్‌కు బలమా? కేసీఆర్‌కు ఆధారమా?

Update: 2025-06-05 11:03 GMT

దేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు అవినీతి, నిర్మాణ లోపాల ఆరోపణలతో కేంద్ర బిందువుగా మారింది. బీఆర్‌ఎస్ పాలనలో నిర్మించిన ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, పంప్‌హౌస్‌లు మునిగిపోవడం వంటి ఘటనలతో కాళేశ్వరం నిర్మాణంలో ఘోర లోపాలు ఉన్నట్లు స్పష్టమవుతుండగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లను కమిషన్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.



గతేడాది మార్చిలో ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు. జూన్ 5న కేసీఆర్‌ను విచారణకు పిలిచిన కమిషన్, ఆయన అభ్యర్థనపై తేదీని జూన్ 11కి మార్చింది. ప్రాజెక్టు రూపకల్పన, అంచనా వ్యయం, నిర్మాణ నాణ్యత, మేడిగడ్డ కుంగింపు వంటి అంశాలపై కేసీఆర్‌కు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.



కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ దశలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు జూన్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు పంపింది. అలాగే ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు జూన్ 6వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా తెలిపింది. ప్రాజెక్టు నిధుల కేటాయింపు, ఆమోదాలు, వ్యయ అంచనాల పెంపు వంటి అంశాలపై వీరిని విచారించనున్నారు.



మొదట్లో వేల కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయంతో మొదలైన ప్రాజెక్టు ఖర్చు.. లక్ష కోట్లకు పైగా పెరగడం, తక్కువ నాణ్యత గల నిర్మాణ సామాగ్రి వాడకం, భారీగా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. అప్పటి ముఖ్య నేతలకు లబ్ధి చేకూరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



ఇక, ఇప్పుడు కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారన్న విషయం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కాళేశ్వరం వివాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి బలంగా మారుతుందా? లేక బీఆర్‌ఎస్ పార్టీకి నైతిక ఆధారమిస్తుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి.




Tags:    

Similar News