కాళేశ్వరం ఎప్పటికీ తెలంగాణ జీవధారే… హరీష్ రావు
కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆధారాలతో సహా సమాధానం చెప్పానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుకు సబంధించి కమిషన్ విచారణ ముగిసిన తరువాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తాను లోపట ఒకటి బయట ఒకటి మాట్లాడనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుని తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు నిర్మించలేదని కమిషన్ అడిగిందని దానికి సమాధానం చెప్పానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించేందుకు 28 ప్యాకేజీలకు అనుమతులు ఇచ్చారని అయినా కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టు అనుమతులు రాలేదని చెప్పారు. మము అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే విషయాన్ని అప్పటి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రికి చెప్పామన్నారు. అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా అనుమతి నిరాకరించిందన్నారు. మా హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఐదారు మీటింగులు జరిగాయని ఒక కీలక సమావేశానికి కేసీఆర్ కూడా మహారాష్ట్ర వచ్చారని గుర్తు చేశారు. మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉన్నాయఅని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే వ్యాప్కోస్ సంస్థ మాకు చెప్పంది. అక్కడ ప్రాజెక్టు కట్టుకోమని వ్యాప్కోస్ చేసిన సూచన మేరకే మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినట్లు కమిషన్ కి వివరించినట్లు హరీష్ రావు తెలిపారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. ఉన్నది అని నేను సమాధానం చెప్పానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం ఎంత అని అడిగితే 141 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం అని కమిషన్ కు చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్న సీయం రేవంత్ రెడ్డి తాను శంకుస్ధాపన చేసిన గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడ నుంచి తెస్తారో సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మూసిని సుందరీ కరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు , మల్లన్న సాగర్ నుంచి మూసికి నీళ్లు తీసుకొస్తామని చెప్తున్నారు. మల్లన్న సాగర్ కు వచ్చే నీళ్లు ఎక్కడివో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎప్పటికైనా తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార వంటిదని హరీష్ రావు అన్నారు.