MP Kadiyam Kavya: పారాక్వాట్ మందు నిషేధం కోసం ఎంపీ కావ్య డిమాండ్
ఎంపీ కావ్య డిమాండ్
MP Kadiyam Kavya: రైతులకు ప్రాణాంతకంగా మారుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డిమందును వెంటనే నిషేధించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం లోక్సభ జీరో అవర్లో ఈ అంశంపై మాట్లాడుతూ ఆమె ఈ విషయం తెలిపారు.
‘పారాక్వాట్ అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పురుగుమందుగా అంతర్జాతీయంగా గుర్తించబడింది. దీనిని పీల్చినా లేదా శరీరంపై పడినా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు విఫలమై మనిషి మరణానికి దారితీయవచ్చు. పంటపొలాల్లో దీని వినియోగం వల్ల నేల, నీరు విషతుల్యం అవుతున్నాయి. రైతుల ప్రాణాలను కాపాడటానికి ఈ మందును తక్షణం నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని ఎంపీ కావ్య డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా లోక్సభలో మరికొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి.
నరేగా కింద తెలంగాణకు రూ.701 కోట్ల బకాయి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద తెలంగాణకు రూ.701 కోట్ల బకాయిలు ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేశ్ పాసవాన్ తెలిపారు. ఇందులో వేతనాల కింద రూ.357.69 కోట్లు, మెటీరియల్ కింద రూ.343.99 కోట్లు చెల్లించాల్సి ఉందని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు.
ఆదిలాబాద్ ఎయిర్పోర్టు భూమి బదలాయింపు విజ్ఞప్తి రాలేదు
ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న వాయుసేన భూములను బదలాయించాలని కోరుతూ పౌర విమానయాన శాఖ లేదా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ తెలిపారు. లోక్సభలో భాజపా ఎంపీ గోడం నగేశ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
రైల్వే భూముల్లో 0.21% ఆక్రమణ మాత్రమే
దేశవ్యాప్తంగా రైల్వేకు చెందిన 4.99 లక్షల హెక్టార్ల భూముల్లో 0.21 శాతం (1,048 హెక్టార్లు) మాత్రమే ఆక్రమణకు గురైనట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం తెలిపారు. సికింద్రాబాద్, వారాంగల్, చిలకలగూడ ప్రాంతాల్లో విలువైన రైల్వే భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.
సిగాచీ పేలుడు ప్రమాదం ఫార్మా ఎగుమతులపై ప్రభావం లేదు
హైదరాబాద్లోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదం ఔషధాల ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపలేదని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
తెలంగాణలో కిందిస్థాయి కోర్టుల్లో 9.90 లక్షల పెండింగ్ కేసులు
తెలంగాణలో జిల్లా కోర్టులతో పాటు కిందిస్థాయి కోర్టుల్లో 9.90 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.