గూగుల్ లాగే మాది కూడా మంచి ప్రభుత్వం – సీయం రేవంత్ రెడ్డి
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభించిన సీయం;
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం ఏదని శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందని నాకు కచ్చితంగా తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీయం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ గూగుల్ లో సెర్చ్ చేస్తే మొదటి లింకు హైదరాబాద్ వస్తుందని దీనిని మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామన్నారు. 2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా అభివృద్ధి చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పమని సీయం వెల్లడించారు. పసిఫిక్ ఆసియాలోనే మొదటి గూగల్ సేఫ్ఈ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్ ప్రపంచంలో ఐదొవది అవడం తెలంగాణకు గర్వకారణమన్నారు. గూగుల్ ప్రారంభించిన నాటి నుంచి ప్రపంచం మారిపోయిందని మన జీవితాలు పూర్తిగా డిజిటల్ గా మారిపోయాయన్నారు. డిజిటల్ సురక్షితంగా ఉంటే మన జీవితాలు కూడా సురక్షితంగా ఉంటాయన్నారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నానని అన్నారు. చెడు చేయవద్దన్న గూగుల్ సంస్థ సిద్ధాంతాన్ని నేను ఇష్టపడతానన్నారు. గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు.
మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నామని గూగుల్ ఆఫీస్ పక్క నే రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని సీయం రేవంత్ రెడ్డి తెలిపారు. మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేసి సంతోషంగా ఉంచాలనుకుంటున్నామని, మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నామని సీయం చెప్పారు. ఈవన్నీ సాధించాలంటే మీ మద్దతు అవసరమని గూగుల్ ప్రతినిధులను కోరారు. గూగుల్, హైదరాబాద్ లు పాత స్నేహితులే అని తెలంగాణ రైజింగ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు. గూగుల్ ఒక వినూత్న సంస్థ అని మాది కూడా ఒక వినూత్న ప్రభుత్వమని హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇటీవలే ట్రాన్స్జెండర్లను నియమించామని పేర్కొన్నారు. గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నానని సీయం రేవంత్ రెడ్డి తెలిపారు.