జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు ప్రధాన రాజకీయ పక్షాలు రెడీ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఓటరు నాడి పట్టడం అంత ఈజీ కాదు. క్లాస్, మాస్ కలగలిపిన ఈ ప్రాంతంపై పట్టు బిగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సై అంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్ధి నేనంటే నేనంటూ చాలా మంది నాయకులు తెరపైకి వస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలు వారిని సున్నితంగా మందలిస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో అసలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సర్వరూప, స్వభావాలు ఏంటి, సామాజిక సమీకరణలు ఏవిధంగా ఉంటాయి, ముస్లీం మైనార్టీల ప్రాబల్యం ఈ నియోజకవర్గంపై ఎంత మేర ఉంటుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
జూబ్లీహిల్స్ పేరుకి ధనవంతులు నివశించే ప్రాంతమే అయినా వారికి సరి సమానంగా దిగువ మధ్యతరగతి, పేదవర్గాలు కూడా అదే ప్రాంతంతో నివాసం ఉంటారు. అత్యంత విలాసవంతమైన భవనాల నడుమ లెక్కకు మిక్కిలిగా పేదల బస్తీలు కూడా జూబ్లీహిల్స్ నిండా అలుముకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ పేరుతో ఉన్న డివిజన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి రాని విచిత్రమైన నియోజకవర్గం ఇది. జూబ్లీహిల్స్ డివిజన్ మొత్తం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆరు డివిజన్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. తరువాత కాలంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018, 2023ల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆరు జీహెచ్ఎంసీ డివిజన్లున్నాయి. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఓటర్లు నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్, రెండు స్థానాల్లో ఎంఐఎం ను గెలిపించారు. ఐదు స్థానాల్లో బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. యూసూఫ్ గూడ, వెంగళ్రావు నగర్, ఎర్రగడ్డ, రహమత్ నగర్, బోరబండ, షేక్ పేట డివిజన్లున్నాయి. షేక్ పేట, ఎర్రగడ్డలో ఎంఐఎం అభ్యర్థులు కార్పోరేటర్లుగా విజయం సాధించారు. యూసూఫ్ గూడ, వెంగళ్ రావు నగర్, రహమత్ నగర్, బోరబండ డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బోరబండ కార్పోరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మాగంటి గోపినాథ్ కు 80 వేల 549 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కు 64 వేల 212 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ 16 వేల 337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్ రెడ్డి 25 వేల ఓట్లకు మాత్రమే పరిమితమై మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నమైన రిజల్ట్స్ ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అంతర్భాగం. ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి పద్మారావుగౌడ్ పోటీ చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు 25 వేల ఓట్ల ఆధిక్యతను అందించారు. దానం నాగేందర్ కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 89 వేల 705 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డికి 64 వేల 673 ఓట్లు వచ్చాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం 18 వేల 405 ఓట్లకు మాత్రమే పరిమితమై.. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
అయితే ఈ సారి జరగబోయే ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి వల్ల వచ్చే సింపతీని వాడుకుని ఎలాగైన పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా అయినా జూబ్లీహిల్స్ని తిరిగి కైవశం చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మంగళవారం గాంధీభవన్ లో జరిగిన పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. అందరూ సమన్వయంతో పని చేసి జూబ్లీహిల్స్ లో విజయం సాధించాలని సీయం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఈ సారి ఎలాగైనా జూబ్లీహిల్స్ లో పాగా వేసి 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది వేసుకోవాలని భావిస్తోంది. వరుసగా మూడు సార్లు బీఆర్ఎస్ కు పట్టం కట్టిన జూబ్లీహిల్స్ ఓటరు ఈ సారి కూడా బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేక ప్రత్యామ్నాయం వైపు చూస్తారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.