ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
MLA Maganti Gopinath passes away;
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ చనిపోయారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారు జామున 5గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5వ తేదీన ఎమ్మెల్యే గోపీనాథ్కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆయన కోలుకుంటారని అందరూ భావించగా.. సరిగ్గా వారం రోజుల తర్వాత మరణించారు.
ఆసుపత్రిలో చేర్పించిన సమయంలోనే గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించిందని, సీపీఆర్ చేయడంతో గుండె తిరిగి కొట్టుకోవడం, నాడి, బీపీ నార్మల్ రేంజ్కు చేరుకున్నాయని వైద్యులు తెలిపారు. అప్పటినుంచి ఐసీయూలో వెంటిలెటర్పై ఉంచి చికిత్స కొనసాగించారు. కొంత కాలంగా మాగంటి గోపీనాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల మూడు నెలల క్రితం కూడా ఏఐజీ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత సమస్యలతో చేరిన గోపీనాథ్కు డయాలసిస్ చేశారు. ఇప్పుడు గుండెపోటు రావడంతో గోపీనాథ్ తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించిన గోపీనాథ్, విద్య మొత్తం హైదరాబాద్లోనే సాగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన బీఏ చదివారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో ఎన్టీ రామారావు ఇచ్చిన పిలుపు మేరకు మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోకి వచ్చారు. 1982లో టీడీపీలో చేరారు. 1982లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టి కొద్దికాలంలోనే పార్టీ అధినేత ఎన్టీయార్ అభిమానం సంపాదించారు. 1985లో ఎన్టీఆర్ స్వయంగా మాగంటిని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆ సమయంలో గోపీనాథ్కు ఎన్టీయార్ స్వయంగా నియామక పత్రం అందించారు. 1992 దాకా గోపీనాథ్ ఆ పదవిలో పనిచేశారు. 1988లో ఏడాదిపాటు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్గా పనిచేశారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లోనూ పనిచేశారు.
2014 నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అదే యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అసెంబ్లీ పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా గోపీనాథ్ వ్యవహరించారు. 2022లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గోపీనాథ్ గెలుపొంది.. ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఏఐజీ హాస్పిటల్ నుంచి ఆయన పార్దివ దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్లోని నివాసానికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్ భౌతికకాయాన్ని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
ఎమ్మెల్యే మాగంటి మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు.
మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.