ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికే నా జీవితం అంకితం - సీతక్క
మావోయిస్టులు తనకి లేఖ రాయడం పట్ల పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందిచారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మీడియాతో మాట్లాడిన సీతక్క… అడవిబిడ్డలు నష్టపోతారని తాను జీఓ 49ని వ్యతిరేకించానని, మా జీవితాలకు గొడ్డలిపెట్టు లాంటి జీఓను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కాకున్నా పార్టీలకు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమై జీఓ 49ని రద్దు చేయాలని తీర్మానించామని చెప్పారు. ఏ హోదాలో, ఏ స్ధాయిలో ఉన్న నేను ఆదివాసి అడవి బిడ్డనే, వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే నా జీవితం అంకితం అని సీతక్క స్పష్టం చేశారు. అడవి బిడ్డల పట్ల అత్యుత్సహాం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఘటనలు మా దృష్టికి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణలతో స్వయంగా మాట్లాడానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నా నియోజకర్గంలో కొంతమంది అటవీ అధికారులు ఆదివాసి గుడిసెల మీద దాడి చేశారు… విషయం నా దృష్టికి రాగానే అధికారులకు ఫోన్ చేసి వెనక్కు పంపించేశామని చెప్పారు. మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్న దానిపై స్పష్టత లేదన్నారు. కానీ లేఖలో లేని అంశాలపై ఒక రాజకీయ పార్టీ, పత్రికలు, మీడియా సంస్ధలు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. మహిళ అని చూడకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ తమ రాజకీయ కక్షను తీర్చుకుంటున్నాయని ఆగ్రహం వ్యవక్తం చేశారు. ఒక మహిళను పట్టుకుని సిగ్గు లేదా అని రాయడం ఎటువంటి జర్నలిజం అని సీతక్క ప్రశ్నించారు. ఓ కోయ మహిళకు జనరల్ పోర్ట్ పోలియో దక్కడం బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.