CM Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10-15% కోత: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10-15% కోత: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: తల్లిదండ్రులను సరిగా చూసుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం వరకు కోత విధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.
ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో ‘బాల భరోసా’ పథకం, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన పరికరాలను అందించామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసమే ఉందని చాటడానికే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, ఇతరులు దివ్యాంగులను పెళ్లి చేసుకున్నా ఆర్థిక సహాయం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు తగిన స్థానాలు కల్పిస్తామని, క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు రావాలని సూచించారు.
ఈ ప్రాంతంలో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిన జైపాల్ రెడ్డిని ప్రస్తావించారు. ట్రాన్స్జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు కల్పిస్తున్నామని చెప్పారు. మంత్రులను, మున్సిపాలిటీల్లో ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేయాలని కోరారు. వారి సమస్యలను వారే వినిపించే అవకాశం ఇవ్వాలన్నారు.
‘ప్రణామ్’ కార్యక్రమం ద్వారా వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ‘‘తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తున్నాం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిని మనమే దారిలోకి తీసుకురావాలి. తల్లిదండ్రులపై బాధ్యత లేనివారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుంది?’’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దాదాపు వందేళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన జరిగిందని, మా ఒత్తిడితోనే కేంద్రం కుల గణన చేస్తోందని వెల్లడించారు. కులల జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, రాజనర్సింహ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.