Revanth Reddy: స్పీకర్పై అసభ్య వ్యాఖ్యలు.. తాతా మధును డిస్మిస్ చేయాలి, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అసభ్యకర, జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘‘ఈరోజు తెలంగాణకు చీకటి రోజు. నాలుగు కోట్ల ప్రజలకు అవమానం జరిగింది’’ అని మండిపడ్డారు.
శాసనసభలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి ‘‘స్పీకర్పై జుగుప్సాకరమైన భాష ఉపయోగించడమేంటి? సభాపతికి జరిగిన అవమానం సభ్య సమాజానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానం. ఇది అనాలోచితంగా జరిగిన చర్య కాదు. నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ సభ్యులను పిలిపించుకుని నేడు స్పీకర్పై ఉసిగొల్పారు. పథకం ప్రకారమే జరిగింది’’ అని ఆరోపించారు.
దళితులపై బీఆర్ఎస్ వైఖరిని విమర్శిస్తూ సీఎం ‘‘దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. బీఆర్ఎస్ది దళిత వ్యతిరేక ఆలోచన. దళిత ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన ఘనత కూడా వారిదే. దళితుడిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోతున్నారు’’ అని అన్నారు.
తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్రెడ్డి ‘‘అసభ్యకర భాష వాడిన తాతా మధును డిస్మిస్ చేయాలి. అతనితో రాజీనామా చేయించాలి. లేకపోతే బర్తరఫ్ చేయాలి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వాటికి క్షమిస్తే చట్టసభలకు గౌరవం, మర్యాద ఉండవు. స్వతంత్ర భారతంలో ఇలాంటి అవమానం గతంలో ఎప్పుడూ జరగలేదు’’ అని స్పష్టం చేశారు.
బీజేపీపై కూడా విమర్శలు గుప్పిస్తూ సీఎం ‘‘బీఆర్ఎస్ వేసిన అపవాదు, దుర్మార్గాలను బీజేపీ ఎందుకు కాపాడుతోంది? స్పీకర్ చైర్ను అవమానిస్తే స్పందించాల్సిన అవసరం బీజేపీకి లేదా? ఈ అంశంపై చర్చకు భాజపా సభ్యులు సహకరించాలి. దీనిపై చర్చ తర్వాతే ఇతర అంశాలపై చర్చిద్దాం’’ అని అన్నారు.
సభాపతి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సీఎం సూచించారు. ‘‘అందరూ ముక్తకంఠంతో ఈ చర్యను ఖండించాలి. స్పీకర్కు జరిగిన అవమానం సభకు జరిగినట్లుగానే భావించాలి’’ అని రేవంత్రెడ్డి అన్నారు.