Minister Uttam Kumar Reddy : అధిక వర్షలపై అధికారులు అప్రమత్తంగా ఉండండి
అధికారులను ఆదేశించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి;
రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖా హెచ్చరిస్తున్న నేపద్యంలో నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ నాలుగు రోజుల పాటు నీటి పారుదల శాఖలో ఉద్యోగులందరికీ అన్ని రకాల సెలవలను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాల్వలతో పాటు చెరువల్లో పెరుగుతున్న నీటి మట్టాలపై నిఘా పెంచాలని మంత్రి సూచించారు. ఎటువంటి విపత్తు సంభవించే అవకాశం గుర్తించినా తక్షణం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్ర స్ధాయిలో పరిస్ధితులపపై ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహించమని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లతో సహా అన్నివిభాగాల అధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాలతో ఎటువంటి నష్టాలు కలుగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సన్నద్ధం కావాలని మంత్రి చెప్పారు. ఎటువంటి సందర్భం ఎదురైన తక్షణ నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సి అంజద్ హుస్సేన్ లతో పాటు ఆయా జిల్లాల సి.ఇ లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు