రేవంత్ రెడ్డి అసత్యాలను ప్రజలు నమ్మరు – హరీష్ రావు
బోడిగుండుకు మోకాలుకు లంకెపెట్టి మాట్లాడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దహస్తుడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ చెప్పిన వాటిని దురుద్దేశపూర్వకంగా వక్రీకరించి రాజకీయ లబ్ది పొందాలనే తప్ప తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలనే తపన రేవంత్ రెడ్డిలో లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అజెండా 5లోని అంశాలను దాచిపెట్టి, అజెండా1 లోఉన్న అంశాలను మాత్రమే రేవంత్ రెడ్డి ప్రస్తావించారని హరీష్ రావు విమర్శించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్ధితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళితే అందుకు తెలంగాణ అంగీకరించదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదొవ అజెండాలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఈవిషయాన్ని కావాలనే దాచిపెట్టి స్వార్ధపూరిత రాజకీయాల కోసం అసత్యాలను ప్రజల ముందు ఉంచారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంలో మీడియాను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అబద్దాల పునాదుల మీద నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించరని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.