బీఆర్ఎస్‌ ని పొలిటికల్‌ గా డ్యామేజ్‌ చేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేస్‌

Update: 2025-06-25 10:37 GMT

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు చట్టపరంగా ఎటు తిరిగి ఎటు వెళుతుందో తెలియదు కానీ రాజకీయపరంగా మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిన వ్యవహారం ఒకత్తైతే 2023లో ఎన్నికలకు ముందు నవంబర్‌ మాసం చివరి రెండు వారాలు జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ మరో ఎత్తని దర్యాప్తు బృందాలు చెపుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ సిట్‌ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్‌ఎస్‌ ఆగ్ర నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు, సంతోష్‌ రావు లను టార్గెట్ చేసుకుని ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు సాగిస్తున్నా… ఈ కేసులో వీళ్ళలో ఎవరిని దోషులుగా నిరూపిస్తోరనేది తరువాత విషయం… ప్రస్తుతం దర్యాప్తు దశలోనే బీఆర్‌ఎస్‌ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగే పరిస్ధితులు కనిపిస్తున్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షుల విచారణ జరుగుతున్న తీరుతెన్నులు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ లక్ష్యం నెరవేరే దిశగానే అడుగులు పడుతున్నాయనే భావన పొలిటికల్‌ సర్కిళ్ళలో కలుగుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసే విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే ప్రచారం జరుగతోంది. ఎవరి ఫోన్లు అయితే ట్యాపింగ్‌ కు గురయ్యాయో వారందరినీ సాక్షులుగా పిలిచి వారు వివిధ సందర్భాల్లో సహచర రాజకీయ నాయకులతో , కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఫోన్‌ సంభాషణలను వారికే వినిపిస్తున్నారు. అవి విన్న నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌ లపై విపరీతమైన కోపం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులకే పరిమితం కాలేదనేది సిట్‌ దర్యాప్తులో తేటతెల్లం అయ్యింది. సొంత పార్టీ బీఆర్‌ఎస్‌ కి చెందిన అనేక మంది నాయకుల ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని సిట్‌ ఆధారాలతో సహా నిరూపిస్తోంది. ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నేతలనే కాకుండా మాజీ బీఆర్ఎస్‌ నేతలను కూడా సాక్షుల పేరుతో పిలిపించి విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా గతంలో వారు చేసిన ఫోన్‌ సంభాషణలను వారికే వినిపిస్తూ షాక్‌ ఇస్తోంది సిట్‌.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రణీత్‌ రావు టీమ్ 4013 ఫోన్‌ నెంబర్లను ట్యాప్‌ చేసినట్లు సిట్‌ విచారణలో వెల్లడయ్యింది. ఇందులో రాజకీయ నాయకులు, ఐఏఎస్‌ లు, ఐపీఎస్‌ లు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు కలిపి 618 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యులు ఈటల రాజేంద్రలతో పాటు ఈ ముగ్గురి నేతల కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారు. త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనం పల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం , మర్రి శశిధర్ రెడ్డిలను కూడా పిలిచి సిట్‌ విచారించనుంది. వీరికి కూడా గతంలో వారి మాట్లాడిన ఫోన్‌ సంభాషణలను సిట్‌ వినిపించనుంది. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు మాజీ శాసనసభ్యులు పద్మాదేవేందర్‌ రెడ్డి, మర్రి జనార్ధనరెడ్డి, తాటికొండ రాజయ్యలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారు. ఇప్పటి వరకూ 228 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుల స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేసింది సిట్‌. మొత్తం 618 మంది స్టేట్మెంట్ ను రికార్డు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

మొత్తం మీద ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం చట్టపరంగా బీఆర్‌ఎస్‌ ను ఎంత డ్యామేజ్‌ చేస్తుందో వేరే విషయం కానీ ప్రస్తుతానికైతే సొంత పార్టీ నాయకులకు తగులుతున్న షాకులు చూస్తే బీఆర్‌ఎస్‌ కి రాజకీయంగా మాత్రం తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News