ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావుకు ముందు నుయ్యి - వెనుక గొయ్యి

Update: 2025-05-27 06:01 GMT

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావుకు అమెరికాలో చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారి అయిన ప్రభాకర్‌ రావు అమెరికాలో తన కుమారుడి వద్ద ఉంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రకంపనలతో ప్రభాకర్‌రావు భారత్‌కు తిరిగి వచ్చే ఆలోచనను విరమించుకొని అమెరికాలోనే స్థిరంగా ఉండేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట అనారోగ్యానికి చికిత్స అంటూ కొద్దిరోజులు కాలం గడిపారు. ఆ క్రమంలోనే అమెరికాలో గ్రీన్‌ కార్డు పొందారు. ఇక, ప్రభాకర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు.. ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం లేదని, అక్కడే ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే, దర్యాప్తు అధికారులు ప్రభాకర్‌రావును అమెరికా నుంచి తిరిగి రప్పించేందుకు న్యాయస్థానం అనుమతి కోరారు. ఇంటర్‌పోల్‌కు సమాచారం ఇచ్చారు. కేసు తీవ్రతను అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు వివరించారు. చివరకు ప్రభాకర్‌ రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసు కూడా జారీ అయ్యింది. ప్రభాకర్‌ రావు పాస్‌పోర్టు కూడా రద్దు చేశారు.

ఇదే క్రమంలో ప్రభాకర్‌రావును తిరిగి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా.. ప్రొక్లెయిమ్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంటే.. న్యాయస్థానం ఆయనను ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించింది. ప్రొక్లెయిమ్‌ నోటీసుల ప్రకారం జూన్‌ 28వ తేదీ లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా ప్రభాకర్‌ రావు హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభాకర్‌ రావు అమెరికాలో న్యాయస్తానాన్ని ఆశ్రయించారు. రాజకీయ కక్షలో భాగంగానే తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, తనను భారత్‌కు అప్పగించ వద్దని, రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలంటూ ప్రభాకర్‌రావు అమెరికా కోర్టును వేడుకున్నారు. అయితే, ప్రభాకర్‌ రావు పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయన వాదనను తోసిపుచ్చింది. దీంతో, ప్రభాకర్‌ రావు అనివార్యంగా జూన్‌ 28లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది.


Tags:    

Similar News