వర్షాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళిక సిద్దం చేయండి...

...జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీయం రేవంత్ రెడ్డి;

Update: 2025-05-28 05:34 GMT

రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని, దానికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణలో రుతుపవనాలు వ్యాప్తి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు, అధికారులతో కలసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ వానలు ముందుగా రావడం వల్ల కొన్ని చోట్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తాయని, రైతులు ఆందోళన చెందారని ముఖ్యమంత్రి అన్నారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు. యాసంగి లో గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేసిందని గత ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటే, ఈసారి ఇప్పటికే 64.50 లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని సీయం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించామని, ఈ సీజన్లో ఇప్పటికే రూ.12184 కోట్లు చెల్లించామన్నారు. అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు సమర్ధంగా పని చేయటం వల్లనే ప్రభుత్వం ఈ విజయం సాధించిందని వారిని సీయం అభినందించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఈ ఏడాది 2.75 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించటం, మన రైతులు సాధించిన విజయమని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో భాగస్వామ్యం పంచుకున్న వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్ విభాగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఏడాది ముందుగా వచ్చిన వర్షాలతో ధాన్యం సేకరణకు అక్కడక్కడ ఆటంకం కలిగిందని అభిప్రాయ పడ్డారు. గత ఏడాదితో పోలిస్తే 21.50 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని, మరో నాలుగైదు లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలి ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. 33 జిల్లాల్లో 21 జిల్లాల్లో ధాన్యం సేకరణ విజయవంతంగా సాగిందని, 12 జిల్లాల్లో అక్కడక్కడ ఆందోళనలు జరిగినట్లు దృష్టికి వచ్చిందని, కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళితే ఈ సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి అన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను దాచిపెట్టకుండా వెల్లడించి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాలనా పరంగా తప్పులు జరిగితే, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని, తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వాలని అన్నారు. ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడ వద్దని అన్నారు.

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 1 నాటికి జిల్లాల వారీగా ఈ అంశాలన్నింటితో పూర్తి నివేదికను తనకు అందించాలని మంత్రులకు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. అదే రోజున సెక్రెటేరియట్లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News