కిషన్‌రెడ్డికి రాజాసింగ్‌ సరికొత్త ప్రతిపాదన

Raja Singh's new proposal to Kishan Reddy;

Update: 2025-06-18 08:17 GMT

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సరికొత్త ప్రతిపాదన చేశారు. భేటీకి సమయం, స్థలం నిర్ణయించాలని సూచించారు. తనతో పాటు.. పార్టీ సహచరులు కొందరం వచ్చి చర్చిస్తామని, కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు.



గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కిషన్‌రెడ్డి టార్గెట్‌గా పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల కిషన్‌రెడ్డి రాజాసింగ్‌ విమర్శలపై స్పందించారు. రాజాసింగ్‌ సీనియర్‌ నాయకుడని, తాను కమలం పార్టీలో సామాన్య కార్యకర్తనని.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాజాసింగ్‌ ఏదైనా చెబితే తాము పాటిస్తామన్నారు. దీనిపై రాజాసింగ్‌ కూడా కిషన్‌రెడ్డికి పై ప్రతిపాదన చేశారు.



ఐక్యంగా కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేద్దామని రాజాసింగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలో అందరికీ తగిన గౌరవాన్ని ఇస్తూ, ఈ విషయంపై తాను నేరుగా స్పందించాలనుకుంటున్నానని తెలిపారు. తన ఉద్దేశ్యం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉంటుందని తెలిపారు. పార్టీలో ఉండేప్రతి ఒక్కరూ బాగుపడాలని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని రాజాసింగ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత లబ్ధి కోసం లేదంటే పదవుల కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని రాజాసింగ్‌ తెలిపారు. పార్టీని బలోపేతం చేయడం, పార్టీ ఆదర్శాలను అంకితభావంతో పనిచేయడంపైనే తాను ఎప్పుడూ దృష్టి పెట్టానన్నారు. అయితే, తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో బీజేపీని ఎలా గెలిపించాలో అనే వ్యూహాలకు బదులు.. తనను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని, తనను విడదీసి, అడ్డంకులు సృష్టిస్తున్నారని.. అయినప్పటికీ తాను పార్టీకి అంకితమైన, నిస్వార్థ సేవ చేశానన్నారు రాజాసింగ్.



కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సమయం కేటాయించాలని, ఆయన ఎప్పుడు చెబితే అప్పుడు, ఎక్కడికి రావాలంటే అక్కడికి వెళ్లేందుకు తాను, తన పార్టీ సహచరులు సిద్ధంగా ఉన్నామని రాజాసింగ్‌ పేర్కొన్నారు. కిషన్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి, సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరస్పర నమ్మకం, స్పష్టత పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. తాము విభజించడానికి కాదని, ఐక్యతను తీసుకురావడానికి ఉన్నాని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటనలో వెల్లడించారు. రాజాసింగ్‌ ఏం చెబితే దాన్ని పాటిస్తామని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేస్తున్నానని రాజాసింగ్‌ పేర్కొన్నారు.


Tags:    

Similar News