మహిళలకు ఫ్రీ బస్ టికెట్లకు రూ.182కోట్లు - డిప్యూటీ సీఎం భట్టి
Rs. 182 crore for free bus tickets for women - Deputy CM Bhatti;
తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తోన్న మహాలక్ష్మి పథకంలో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ పథకం ప్రారంభించినప్పటినుంచీ ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు.. రూ.182 కోట్ల విలువైన జీరో టికెట్లను జారీ చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట ఆర్టీసీ బస్ డిపోలో కొత్తగా మంజూరైన ఎలక్ట్రిక్ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని, అయితే, ఆ మొత్తం డబ్బులను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించిందన్నారు.
మహాలక్ష్మి పథకం అమలవుతున్నప్పటినుంచీ ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుస్తున్నాయని, ఈ పథకం వల్ల ఆర్టీసీ సంస్థకు కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతోందని భట్టి వెల్లడించారు. ఆర్టీసీకి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.