State Information Commission: ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన వేల ఆర్టీఐలపై రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ
రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ
State Information Commission: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వేల సంఖ్యలో దరఖాస్తులు, వందల కొద్దీ అప్పీళ్లు దాఖలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై రాష్ట్ర సమాచార కమిషన్ గురువారం (సెప్టెంబర్ 18, 2025) విచారణ చేపట్టింది. ఈ విచారణలో ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాసరావు, ఎం. పర్వీన్, డి. భూపాల్, వైష్ణవి మేర్ల పాల్గొన్నారు.
ఈ ముగ్గురు వ్యక్తుల దరఖాస్తులు, అప్పీళ్ల వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి, వారు కోరే సమాచారం స్వభావం వంటి అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 1.2 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు దాఖలవుతుండగా, 90% మందికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల (పీఐఓలు) ద్వారా సమాచారం అందుతోంది. కేవలం 8% మంది మాత్రమే రెండో అప్పీల్ కోసం కమిషన్ను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ ముగ్గురు వ్యక్తులు 2,500 కేసుల్లో పీఐఓలతో కలిసి కమిషన్ ముందుకు వచ్చారు.
శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక శాఖ నుంచి నిధులు, బడ్జెట్ వివరాలపై వేల దరఖాస్తులు సమర్పించారు. వడ్డే శ్యామ్ పురపాలక, డీటీసీపీ శాఖలకు సంబంధించి అనుమతులు, ఓసీల గురించి సమాచారం కోరారు. ఎండీ అష్రాఫ్ సుమారు 20 జిల్లాల్లో పాఠశాల విద్య, హోమ్, రెవెన్యూ శాఖలపై దరఖాస్తులు దాఖలు చేశారు.
ఒకే వ్యక్తి వందల సంఖ్యలో అప్పీళ్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు? పదేపదే దరఖాస్తులు ఎందుకు సమర్పిస్తున్నారు? వారి ఉద్దేశాలు ఏమిటి? ఈ దరఖాస్తులు పరిపాలనా సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అనే అంశాలపై కమిషన్ చర్చించింది. అలాగే, పీఐఓలు సమాచారం అందించలేకపోవడానికి కారణాలు, వెబ్సైట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని మళ్లీ ఎందుకు కోరుతున్నారనే విషయాలపై కూడా కమిషన్ లోతుగా విచారించింది.