Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 29 నుంచి

అసెంబ్లీ సమావేశాలు 29 నుంచి

Update: 2025-12-23 05:58 GMT

కృష్ణా, గోదావరి నీటి వాటాలపై విస్తృత చర్చ

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

జీహెచ్‌ఎంసీని మూడు మహానగరాలుగా విభజన.. విస్తరణపై ఆర్డినెన్స్‌ సిద్ధం?

సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో సమావేశం


Telangana Assembly Sessions: కృష్ణా, గోదావరి నదుల జలాల గురించి లోతైన చర్చలు జరపడానికి ఈ నెల 29వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన వ్యయాలు వంటి అన్ని కీలక అంశాలపై సమగ్రంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రులందరినీ సమావేశపరిచి సీఎం చర్చలు జరిపారు. ముందుగా పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలపై మంత్రులను అభినందించారు. అనంతరం సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా-గోదావరి బేసిన్‌ పరిస్థితులు, ఇటీవల మాజీ సీఎం కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా మాట్లాడారు. వచ్చే ఫిబ్రవరి నెలలో మున్సిపల్‌ ఎన్నికలు జరపాలని, ఓటర్ల జాబితా సవరణలు పూర్తయిన తర్వాతే అంతిమ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

70-80 డివిజన్లతో కొత్త మహానగరాలు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర విస్తరణ, డివిజన్ల పెంపు, దీనిపై వస్తున్న ఫిర్యాదుల గురించి సీఎం మంత్రులతో లోతుగా చర్చించారు. విస్తరణ పూర్తి అయిన తర్వాత మొత్తం నగరాన్ని మూడు మహానగరపాలక సంస్థలుగా విభజించడం ఎలా ఉంటుందని ప్రతిపాదించారు. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పరిధిని అలాగే కొనసాగిస్తూ, కొత్త డివిజన్లతో మరో రెండు మహానగర సంస్థలు ఏర్పాటు చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీటిలో ఒకదానికి సైబరాబాద్‌ అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. మొదట 70-80 డివిజన్లతో ప్రతి మహానగర సంస్థను ఏర్పాటు చేసి, తర్వాత వాటిని 100కు పెంచాలని చర్చలు జరిగాయి. నగర విస్తరణపై ఆర్డినెన్స్‌ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విస్తరణతో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డివిజన్లు వస్తాయి, విస్తరణ తర్వాత రాజకీయ మార్పులు ఎలా ఉంటాయనే అంశాలపైనా విశ్లేషణ జరిగింది.

సర్పంచులతో భారీ సమావేశం

ఎన్నికల ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిచిన స్థానాలు, సర్పంచుల విద్యార్హతలు వంటి వివరాలపై చర్చ జరిగింది. గెలిచిన సర్పంచులను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మూడు బృందాలుగా విభజించి శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. సంక్రాంతి పండుగ నాటికి హైదరాబాద్‌లో సర్పంచులందరితో భారీ సభ నిర్వహించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. పంచాయతీల వారీగా పోటీ చేసిన, గెలిచిన, ఓడిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, పార్టీల మద్దతు వివరాలను మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సేకరించి విశ్లేషించాలని నిర్ణయించారు.

గట్టి వాదనలతో ఎదుర్కోవాలి

అసెంబ్లీలో ‘నీళ్లు-నిజాలు’ అనే థీమ్‌తో నదీ జలాల వాటాల సాధనలో భారాస ప్రభుత్వం చేసిన తప్పులను గట్టిగా ఎత్తిచూపాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి వాటాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలను చర్చకు తీసుకురానున్నారు. ఇరిగేషన్‌, ప్రాజెక్టుల నిర్మాణాల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అసెంబ్లీలో బట్టబయలు చేయాలని సీఎం మంత్రులకు సూచించారు.

భారాస హయాంలోనే డీపీఆర్‌ తిరస్కరణ: సీఎం

2023లో భారాస ప్రభుత్వ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రం తిరస్కరించి వెనక్కు పంపిందని సీఎం తెలిపారు. ఎన్జీటీ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగినపుడు తాగునీరు ప్రాజెక్టుగానే చేపట్టామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. దీంతో 7.25 టీఎంసీలకే పనులు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90 టీఎంసీలతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, దీనిపై అసెంబ్లీలో స్పష్టత ఇవ్వాలని సీఎం అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News