తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కి ఏటీఎంగా మారింది – కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ బ్యాగ్ మెన్ రేవంత్ రెడ్డి పేరును నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు నమోదు చేయడం ద్వారా ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలు కూడా ఇదే విషయాన్ని చెపుతున్నాయని కేటీఆర్ అన్నారు. తన పేరు ఈడీ ఛార్జ్షీటులో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ తో డైవర్షన్ డ్రామాలు మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్ లో పెట్టడంతో సీయం అవినీతి బండారం మొత్తం బయటపడిందని కేటీఆర్ విమర్శించారు. యంగ్ ఇండియా సంస్ధకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేంవంత్ రెడ్డి ప్రలోభపెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జ్ షీట్ లో పేర్కొనడంతో సీయం అవినీతి సామ్రజ్యం బట్టబయలైందన్నారు. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైందన్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోందన్నారు. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయని అన్నారు. ఈడి చార్జిషీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత అయినా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లేకపోతే అమృత్ స్కాం, ఆర్ఆర్ టాక్స్ స్కాం, సివిల్ సప్లై స్కాం వంటి వాటిలో ఇంతకుముందు వదిలేసినట్లుగా వదిలేస్తుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.