హైడ్రా వంటి సంస్ధ దేశంలో మరొకటి లేదు
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి;
పర్యావరణ పరిరక్షనే ప్రధానంగా హైడ్రా పనిచేస్తోందని, ఇటువంటి సంస్ధ దేశంలో ఎక్కడా లేదని ఆ సంస్ధ కమిషనర్ ఆవుల రంగనాథ్ అన్నారు. హైడ్రా సంస్ధ ఏర్పాటు చేసి ఏడాది అయిన సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కమిషనర్ రంగనాథ్ పలు అంశాలను పంచుకున్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్లో మార్పులు చేయడం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసి పలు అధికారాలు కల్పించినట్లు రంగనాథ్ తెలిపారు. సిబ్బంది తక్కువ ఉన్నా బాగానే పని చేస్తున్నామన్నారు. కొత్త తరహా కార్యక్రమం కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని అన్నారు. హైడ్రావైపు ఏమైనా తప్పులు జరిగినా సమీక్షించుకుంటామని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు హైడ్రాకు చాలా సహకరిస్తున్నారని చెప్పారు. హైడ్రాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యమైన పని అని, నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీవ పనలు చేస్తున్నామని వెల్లడించారు. వర్షం లేనప్పడు హైడ్రా సిబ్బంది నాలాలు, మ్యాన్ హోల్స్ క్లీన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసే సమయంలో చాలా ఆరోపణలు వచ్చాయని అయినా నిరాశపడకుండా బతుకమ్మకుంట, కూకట్పల్లి చెరువులను బాగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పుడు చేస్తున్న పనులు వంద ఏళ్ళ వరకూ ఉపయోగపడతాయని రంగనాథ్ వివరించారు. నగరంఓ 60 శాతం పైగా చెరువులు మాయమయ్యాయని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. సీఎస్ఆర్ కింద చెరువులను కొట్టేయాలని చూస్తే ఊరుకునేది లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువుల మాదిరిగా నాలాల కబ్జాలు నిరోధించేందుకు వాటిని కూడా నోటిఫై చేస్తామని హైడ్రా కమిషనర్ ప్రకటించారు.