Tummala Nageswara Rao: పసుపు రైతులకు పూర్తి మద్దతు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Tummala Nageswara Rao: పసుపు రైతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తేమ కలిగిన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని అధికారులను ఆదేశించారు.
మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
“నిజామాబాద్ మార్కెట్కు పసుపు భారీగా వస్తోంది. 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం బిడ్డింగ్ పూర్తి చేశాం. పసుపు కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించాం” అని తుమ్మల తెలిపారు.
మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం ఖరారు చేసిన ధర చెల్లిస్తున్నామని, రైతులకు చెల్లింపులు సక్రమంగా జరగాలని అధికారులకు సూచనలు జారీ చేశామని మంత్రి వివరించారు.
పసుపు రైతుల సమస్యలు పరిష్కరించి, వారి పంటలకు సరైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు కూడా నాణ్యత ఉన్న పసుపును సరైన తేమ స్థాయిలో సరఫరా చేయాలని సూచించారు.