కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి?
What is the political future of kavitha?;
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడిందా? నెక్ట్స్ ఏంటన్న సందిగ్ధం ఆమెను వెంటాడుతోందా? కేసీఆరే స్వయంగా పిలిచి మాట్లాడతారని భావించిన కవిత ఆశలు అడియాసలయ్యాయా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అమెరికా వెళ్లి తిరిగొచ్చిన తర్వాత నుంచి కవిత.. పార్టీ అధిష్టానంపైనా, ఓ రకంగా తండ్రి కేసీఆర్పైనా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, తండ్రి కేసీఆర్ను దేవుడు అని పొగుడుతున్నా.. పార్టీని విమర్శించడం, పార్టీలో ఉన్న ముఖ్య నేతలపై తన అసంతృప్తిని వెల్లగక్కడం, కేసీఆర్ చుట్టూ ఉండే వాళ్లపైనా అక్కసు వెళ్లగక్కడం చూస్తుంటే పరోక్షంగా కేసీఆర్ను కూడా విమర్శిస్తున్నట్లే భావిస్తున్నారట. దీంతో, కవితకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు.
కొద్దిరోజులుగా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కవిత తన అసంతృప్తిని వెల్లడిస్తున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. దీంతో, ఆయనకు మద్దతుగా ధర్నా చేసిన తర్వాత అయినా.. కేసీఆర్ తప్పకుండా స్పందిస్తారని, తనను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడతారని కవిత భావించారట. ఆ ఆలోచనతోనే కవిత.. కేసీఆర్కు మద్దతుగా ధర్నాచౌక్లో నిరసన తెలిపారట. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. పైగా.. కవిత చేసిన కామెంట్స్ వ్యవహారంలో గులాబీ పార్టీ బాస్ బాస్ కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారని అనుకుంటున్నారు. కవితకు ఏదైనా సమస్య ఉంటే.. అసంతృప్తి ఉంటే.. నేరుగా తన వద్దకు వచ్చి చెప్పుకుంటే బాగుండేదని, కానీ.. అలా కాకుండా ప్రత్యేకంగా తనకు లేఖ రాసి రాద్ధాంతం క్రియేట్ చేసిందని కేసీఆర్ గుర్రుగా ఉన్నారంటున్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న లోటుపాట్లపై కేసీఆర్కు లెటర్ రాసిన కల్వకుంట్ల కవిత.. తన తండ్రి కేసీఆర్ మాత్రం దేవుడని, ఆయన చుట్టూ ఉన్నవే దెయ్యాలనీ, కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పార్టీలోనే కాదు.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే పెద్ద చర్చకు కారణమయ్యాయి.
మరోవైపు.. తాను తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందో తేలాల్సిందేనని కవిత పట్టుబట్టారు. అంతేకాదు.. తన సోదరుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తూ.. పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. ఈ క్రమంలోనే కేసీఆర్ కూతురుగా కవిత త్వరలోనే ఓ పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నారని చర్చ నడిచింది. కానీ, అంతలోనే తన గేర్ మార్చిన కవిత... తండ్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులివ్వడంపై హైదరాబాద్ ఇందిరా పార్క్ పక్కన ఉన్న ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ధర్నా చౌక్లో ధర్నా చేయడం వెనుక కవిత ప్లాన్ వేరే ఉందని.. కానీ, ఆ వ్యూహం వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆరే సుప్రీం లీడర్. అందులో ఎవరికీ అనుమానాలు లేవు. వివాదం కూడా లేదు. అలాంటి కేసీఆర్కు మద్దతుగా కవిత ధర్నా చేసినా.. అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా కనిపించలేదు. కవిత ఎవరినైనా ఈ ధర్నా కార్యక్రమానికి పిలిచారో లేదో తెలియదు. లేదంటే కవిత పిలిచినా ఎవరూ రాలేదా? అన్న చర్చ జరుగుతోంది. ఒక్క బీఆర్ఎస్ లీడర్ కూడా కవిత నిర్వహించిన ధర్నా వైపు కన్నెత్తి చూడలేదు. గతంలో కవిత ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా. పోటా పోటీగా గులాబా పార్టీ నేతలు హాజరై అటెండెన్స్ వేయించుకునే వాళ్లు.. కానీ, ఈ సారి మాత్రం కేసీఆర్కు మద్దతుగా ధర్నా చేపట్టినా నాయకులందరూ మొహం చాటేశారు.
అయితే, కల్వకుంట్ల కవిత ఇన్ని రోజులు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేసీఆర్కు మద్దతుగా నిర్వహించిన మహా ధర్నా మరో ఎత్తుగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ జాగృతి పేరుతో వందల కార్యక్రమాలు చేసిన కవితకు ప్రతీ సందర్భంలోనూ బీఆర్ఎస్ నేతలు, పార్టీ కేడర్ మద్దతుగా వెన్నంటి నడిచారు. ఎక్కడైనా.. ఎప్పుడైనా కవితను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు. కానీ, తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లెటర్ లీక్ అయిన తర్వాత ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. కేసీఆర్ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే కేసీఆర్. అలాంటి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే.. దాన్ని నిరసిస్తూ చేసిన ధర్నాలో గులాబీ జెండాలు గానీ, గులాబా కండువాలు గానీ పెట్టలేదు. పైగా ఆ పార్టీకి చెందిన నాయకులెవరూ హాజరు కాలేదు. అంటే.. కవిత తనంత తానుగానే బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లుగా కవిత ఏం మాట్లాడినా, ఎన్ని లేఖలు రాసినా ఆమె ప్రయాణం మాత్రం బీఆర్ఎస్తోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం లేఖ లీక్ అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు సందేహాలకు దారి తీస్తున్నాయి.
రోజురోజుకూ కవిత బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లే కనిపిస్తోందన్న చర్చ జోరుగా నడుస్తోంది. కవిత కేసీఆర్కు రాసిన లెటర్ లీక్ అయిన తర్వాత కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా బీఆర్ఎస్ జెండా కానీ, ఆ పార్టీ నేతలు గాని ఆమె కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీన్ని బట్టే పార్టీ కవితను దూరం పెట్టేసిందని, ఆమె కూడా పార్టీకి దూరమవుతున్నారని, కవిత ఇప్పుడు ఒంటరి అయ్యారనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కనీసం కవిత పేరే ఎత్తడం లేదంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ బీఆర్ఎస్ నాయకులే ఆమెతో దూరం మెయింటెన్ చేస్తున్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక, కేసీఆర్ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన దర్నాకు బీఆర్ఎస్ కేడర్ పూర్తిగా దూరంగా ఉండటం.. ధర్నాకు కూడా పెద్దగా స్పందన లేకపోవడానికి తోడు కనీసం కేసీఆర్ నుండి పిలుపు కూడా రాకపోవడంతో ఇప్పుడేం చేయాలో పాలుపోక కవిత అండ్ టీమ్ ఆందోళన చెందుతోందంటున్నారు. కొన్ని రోజులుగా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్.. ఆయనకు మద్దతుగా ధర్నా చేశాక కచ్చితంగా స్పందిస్తారని, తనను పిలిపిస్తారని, మాట్లాడతారని కవిత భావించారట. కానీ, ఫామ్ హౌజ్ నుంచి మాత్రం నో రెస్పాన్స్ అంటున్నారు. దీంతో.. కవిత చాలా నిరాశ చెందారనే చర్చ తెలంగాణ జాగృతి వర్గాల్లో జరుగుతోంది. దీంతో, కవితను పార్టీ వద్దనుకుంటోందా ? లేదంటే కవితే పార్టీకి దూరంగా జరుగుతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఇప్పటికిప్పుడైతే ఏమీ చెప్పలేని పరిస్థితులు నెలకన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఎవ్వరికీ అంతుపట్టడం లేదంటున్నారు. అంటే.. ఇక బీఆర్ఎస్తో కవిత బంధం తెగినట్లేనా? అన్నది చూడాలి.