రాజాసింగ్ దారిలోకి వస్తారా...? దారి తప్పుతారా...?
తెలంగాణ బీజేపీ నాయకత్వానికి చుక్కలు చూపిస్తున్న రాజాసింగ్;
రాజా సింగ్… భారతీయ జనతా పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఇప్పుడు సొంత పార్టీలో సీనియర్ నేతలకే నిద్రపట్టకుండా చేస్తున్నారు. కట్టర్ హిందూవాదిగా ముద్ర పడ్డ రాజసింగ్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఏకైక బీజేపీ శాసనసభ్యుడు. ఆ ఎన్నికల్లో హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. సొంత పార్టీలోనే అనేక ఒడిదుడుకులు ఎదర్కొంటున్న రాజాసింగ్ గత కొద్ది కాలంగా బీజేపీ రాష్ట్ర స్ధాయి నేతలపై వారి వ్యవహార సరళిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాకరేపుతున్నారు. పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తూ ఏకంగా టాప్ మోస్ట్ సీనియర్ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలను తప్పుపడుతున్న రాజాసింగ్ తన అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని సైతం రాజాసింగ్ వ్యతిరేకిస్తూ నాయకత్వ పోకడలను నిశితంగా విమర్శిస్తున్నారు. పార్టీలో పాత సామాన్లు బయటకు పంపితే తెలంగాణ బీజేపీ బాగుపడుతుందని కేంద్ర మంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ కే.లక్ష్మణ్లను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు మీడియా ముఖంగా చేస్తున్నారు. హైదరాబాద్ ఎంపీగా మాధవీలతను ఎంపిక చేసిన నాటి నుంచి రాజా సింగ్ సందర్భం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడి ఎంపిక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్ధి వంటి అనేక అంశాల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై రాజాసింగ్ తన అభ్యంతరాలను బాహాటంగానే వ్యక్తపరచారు.
ఇవన్నీ ఒకెత్తైతే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్ కి లేఖ రాసిన తదనంతర పరిణామాలపై కూడా రాజా సింగ్ స్పందిచారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తమ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం తాను జైలులో ఉన్నప్పుడు నా వద్ద ప్రస్తావన తెచ్చారని కవిత చేసిన సంచలన వ్యాఖ్యలపై రాజాసింగ్ మాట్టాడుతూ కవిత చెప్పిన విషయాలు కరక్టే అయిఉండవచ్చని తేల్చేశారు. అంతటితో ఊరుకోకుండా మా పార్టీ నాయకులకు ప్యాకేజీలు ఇస్తే దేనికైనా సిద్దపడతారని బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుకోవడానికి మావాళ్ళు సహకరించడంలో వింతేమీ లేదని తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. రాజాసింగ్ చేసిన ఈ విమర్శలు పార్టీలో పెద్దపెట్టున చర్చకు దారితీశాయి. రాజాసింగ్ ఇంతగా రాష్ట్ర అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నా పార్టీలో గుర్తింపు ఉన్న నేతలు ఎవ్వరూ రియాక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణే టార్గెట్ చేసి రాజా సింగ్ మాట్లాడుతున్నా ఆయనకు కౌంటర్ ఇచ్చే పరిస్ధితి తెలంగాణ బీజేపీలో కనిపించడం లేదు. అయితే రాజాసింగ్ వ్యవహార సరళిపై క్షేత్ర స్ధాయి కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలువురు సోషల్ మీడియా కార్యకర్తలైతే పార్టీ సీనియర్లపై రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో మండిపడుతున్నారు. రాజాసింగ్ పార్టీ లైన్ దాటుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ సోషల్ మీడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజాసింగ్ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే… పోస్టులు పెట్టిన వారిని ఏమనకుండా వారి వెనుక ఎవరున్నారో నాకు తెలుసంటూ యధావిధిగా తాను ఇప్పటి వరకూ ఎవరినైతే టార్గెట్ చేస్తూ వస్తున్నారో ఈ విషయంలో కూడా వారినే టార్గెట్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం కానీ బీజేపీ సీనియర్ నేతలు కానీ రాజాసింగ్ విషయంలో బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా రాజాసింగ్ పార్టీపైనా, నాయకత్వం పైనా చేస్తున్న విమర్శలను, ఇబ్బందిక వ్యాఖ్యలను ఎప్పటికప్పడు అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నట్లు సమాచారం. రాష్ట్రా పార్టీ రాజాసింగ్ పై అందిస్తున్న సమాచారం ఆధారంగా బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పార్టీ లైన్ దాటి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై అతనికి నోటీసులు ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ బీజేపీని ఆదేశించిటనట్లు సమాచారం.
మూడు, నాలుగు సార్లు, గెలిచినంత మాత్రన వారు ఏది మాట్లాడినా సాగుతుందని అనుకోవద్దని క్రమశిక్షణను ఉల్లఘింస్తే పార్టీ ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటుందనే సంకేతాలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల జరిగిన ఒక వర్క్ షాప్లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ తీవ్రంగానే హెచ్చరించారు.ఈ క్రమంలోనే రాజాసింగ్కు నోటీసులు ఇస్తారన్న దానిపై పార్టీ ఆఫీస్లో చర్చ జరుగుతోంది. నోటీసులు ఇస్తారన్న మ్యాటర్ లీక్ కావడంతో రాజాసింగ్ తన స్వరాన్ని మరింత పెంచారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలని ఆయన బీజేపీ అధిష్టానానికే సవాల్ విసురుతున్నారు. తాను బయటికి వెళ్లే ముందు అందరి బండారాన్ని బయటపెడతానని హెచ్చరిస్తున్నారు. అయితే రాజాసింగ్ ఇంతగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ బీజేపీ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బండి సంజయ్తో పాటు పలువురు నేతలు తనతో బానే ఉంటూ..కిషన్రెడ్డితో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. అందుకే వారూవీరూ అని లేకుండా అందరినీ టార్గెట్ చేస్తూ రాజాసింగ్ అటాకింగ్ స్టార్ట్ చేశారని అంటున్నారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని..అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుని గోసేవ చేసుకుంటానని రాజాసింగ్ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ రిటైరవ్వాల్సిన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత జాతీయ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇప్పుడు మరోసారి ఆయనపై చర్యలు తీసుకుంటారా అన్నది సస్పెన్స్గా మారింది. కమలం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రాజాసింగ్ వెనుక ఎవరున్నారనేది హాట్ టాపిక్గా మారింది. అయితే ఈసారి మాత్రం వ్యవహారం కొంచెం ముదిరి పాకన పడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. పార్టీ రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.