CP VC Sajjanar Warns: విధుల్లో ఉన్న అధికారులపై దాడికి పాల్పడితే ఊరుకోము.. కఠినంగా శిక్షిస్తాం: సీపీ వీసీ సజ్జనార్ హెచరిక
కఠినంగా శిక్షిస్తాం: సీపీ వీసీ సజ్జనార్ హెచరిక
CP VC Sajjanar Warns: విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు లేదా ఆటంకాలు కలిగించే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు వంటి ప్రభుత్వ సిబ్బంది విధులకు భంగం కలిగించడం సహించేది లేదని, అలాంటి వారిపై వెంటనే క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.
భారతీయ న్యాయ స్మృతి (బీఎన్ఎస్)లోని సెక్షన్ 221, 132, 121(1) కింద నేరాలు నమోదు చేస్తామని సీపీ తెలిపారు. అంతేకాకుండా, ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులపై హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. ఒక్కసారి క్రిమినల్ కేసు నమోదైతే ఆ వ్యక్తి భవిష్యత్తు అంతా చీకటిపరుస్తుందని, పాస్పోర్టు జారీ నుంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల వరకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన హితవు పలికారు.
“క్షణికావేశంలో చేసిన చిన్న తప్పు కూడా జీవితాంతం మచ్చలా మిగిలిపోతుంది. ప్రజలు సంయమనం పాటించాలి. విధి నిర్వహణలో ఉన్న అధికారులను గౌరవించడమే సమాజ బాధ్యత” అని సజ్జనార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ హెచ్చరికలు ఇటీవల పలు ఘటనల నేపథ్యంలో వెలువడినవి. ప్రభుత్వ అధికారుల పట్ల గౌరవం పాటించాలని, లేనియడ్లా చట్టం తన పని తాను చేసుకుంటుందని సీపీ స్పష్టం చేశారు.