దేశంలో యోగి ఆదిత్యనాథ్‌, రేవంత్‌రెడ్డే ఉత్తమ సీఎంలు - రాజాసింగ్‌ ఆసక్తికర కామెంట్స్‌

Yogi Adityanath and Revanth Reddy are the best CMs in the country - Raja Singh's interesting comments;

Update: 2025-06-18 07:21 GMT

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. దేశంలో ఆ విషయంలో నిజమైన ముఖ్యమంత్రులు ఇద్దరే అని వారిలో ఒకరు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ అయితే, రెండో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులు చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని రేవంత్‌ రెడ్డికి రాజాసింగ్ సూచించారు.

ఇంతకీ ఏ విషయంలో రాజాసింగ్‌ ఇంతగా రేవంత్‌రెడ్డిని ప్రశంసించారంటే.. గోశాలల నిర్మాణం గురించి రేవంత్‌ను ఆకాశానికెత్తేశారు. తెలంగాణలో గోశాలల నిర్మాణం, ఆయా ఆలయాల్లో గోవుల అవస్థల నిర్మూలనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఒక్కోచోట వంద ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు నిర్మించాలని, గోవుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో రేవంత్‌ రెడ్డి గోవుల సంరక్షణకు తీసుకున్న ప్రత్యేక చొరవను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అభినందించారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల విశాలమైన, అధునాతన గోశాలలు నిర్మించాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో నిత్యం వేల సంఖ్యలో గోవులను, దూడలను, ఎద్దులను కబేళాల్లో చంపేస్తున్నారని, అక్రమంగా గోవధ శాలలు నిర్వహిస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు. వీటిని నివారించేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాదు.. మోడల్‌ గోశాలలు నిర్మించాలన్న నిర్ణయం చాలా గొప్పదన్న రాజాసింగ్‌.. గో సంరక్షణ గురించి స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని రేవంత్‌కు సూచించారు. ఆ స్పెషల్‌ ఫోర్స్‌లో తనను సభ్యుడిగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రుల్లో గోవులకు సేవ చేస్తున్న ముఖ్యమంత్రులు ఎవరని అడిగితే రెండే పేర్లు ప్రస్తావనకు వస్తాయని, ఒకరు ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, రెండో వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని తెలిపారు.


Tags:    

Similar News