Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్‌డేట్.. వాహనదారులకు భారీ ఊరట

వాహనదారులకు భారీ ఊరట

Update: 2026-04-24 10:11 GMT

Petrol Price : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ధరల పెంపు వార్తలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. సామాన్యులపై భార పడకుండా ఉండేందుకు ధరలను ప్రస్తుతానికి స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వైరల్ వార్తల్లో నిజమెంత?

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.25 నుంచి రూ.28 వరకు పెరుగుతాయని గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనివల్ల వాహనదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. ఇవన్నీ కేవలం ప్రజల్లో భయాన్ని కలిగించడానికి సృష్టించిన తప్పుడు వార్తలని, ధరల పెంపు ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది.

చమురు కంపెనీల పరిస్థితి ఏమిటి?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్న మాట వాస్తవమే. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.20 వరకు, డీజిల్‌పై ఏకంగా రూ.100 వరకు నష్టాన్ని భరిస్తున్నట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా దెబ్బతినడం కంపెనీలకు భారంగా మారింది. అయినప్పటికీ, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భారాన్ని ప్రజలపై వేయడం లేదని ప్రభుత్వం వివరించింది.

పెరిగిన క్రూడాయిల్ ధరలు

పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న యుద్ధ వాతావరణం చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణం. గత ఏడాది బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 113 డాలర్లకు పైగా చేరింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, భారత్ తన దేశీయ ధరలను నియంత్రించగలుగుతోంది.

భారత్‌లో ప్రస్తుత ధరలు

గత నాలుగు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకినా, భారత్‌లో మాత్రం ధరలు పెద్దగా పెరగలేదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77, డీజిల్ రూ.87.67 వద్ద విక్రయించబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ క్లారిటీతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట లభించినట్లయింది.

Tags:    

Similar News