Stock Market : ఈ ఏడాది స్టాక్ మార్కెట్ రేంజ్ ఎంత? లక్ష మార్క్‌ను సెన్సెక్స్ దాటుతుందా?

లక్ష మార్క్‌ను సెన్సెక్స్ దాటుతుందా?

Update: 2026-07-11 05:24 GMT

Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్ ఈ ఏడాది ఒక ఆసక్తికరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. సెన్సెక్స్ 1 లక్ష మార్కును తాకుతుందా లేదా అనే ఉత్కంఠ ఇన్వెస్టర్లలో నెలకొంది. ఎన్‌ఎస్‌డీఎల్ తాజా గణాంకాల ప్రకారం.. జులై 10, 2026 నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి రూ.2.59 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే, వీరికి గట్టి పోటీ ఇస్తూ దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, సిప్‎ల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.4.8 లక్షల కోట్లను మార్కెట్లో పెట్టుబడిగా పెట్టారు. దీనివల్ల విదేశీ నిధుల ఉపసంహరణ ప్రభావం మార్కెట్‌పై పడకుండా బ్యాలెన్స్ అయింది.

ఈ ఏడాది పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్

మల్టీప్లైడ్ క్యాపిటల్ అడ్వైజర్స్ కో-ఫౌండర్ నిఖిల్ చావ్లా అభిప్రాయం ప్రకారం.. 2026లో భారత స్టాక్ మార్కెట్ ఒక పరిమిత పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షేర్లలో ఉన్న విపరీతమైన క్రేజ్ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా కొనసాగుతుండటంతో, అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంచేలా కఠిన విధానాలు అవలంబిస్తోంది. ఇది గ్లోబల్ టెక్ షేర్లపై తీవ్ర ఒత్తిడిని తెస్తోంది. అమెరికా ఉపాధి గణాంకాలు బలహీనంగా ఉండటంతో వడ్డీ రేట్లు మరింత పెరగకపోవచ్చు కానీ, త్వరగా తగ్గుతాయన్న నమ్మకం కూడా లేదు.

భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లను దేశీయ ఇన్వెస్టర్లే కాపాడుతున్నప్పటికీ, సుదీర్ఘకాలం పాటు కేవలం స్థానిక నిధులపైనే మార్కెట్ ఆధారపడటం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, బలహీనమైన రుతుపవనాలు దేశీయ గ్రామీణ డిమాండ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9% నుండి 6.6%కి తగ్గించింది. అయితే, దీర్ఘకాలంలో భారత ఫిజికల్ ఎకానమీ అద్భుతంగా ఉండబోతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, తయారీ రంగం, స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్, లాజిస్టిక్స్, ఫార్మా మరియు డిజిటల్ పేమెంట్స్ వంటి రంగాలు ప్రభుత్వ పాలసీల మద్దతుతో భవిష్యత్తులో బంపర్ లాభాలను అందించనున్నాయి.

ఎఫ్ఐఐల అమ్మకాలకు భయపడొద్దు

పీఎల్ అసెట్ మేనేజ్‌మెంట్ సీఐఓ సందీప్ నీమా మాట్లాడుతూ.. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను చూసి చిన్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చారిత్రక ఆధారాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపే కాలం, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు నాణ్యమైన షేర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించినా లేదా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు కొత్త మార్కెట్ల కోసం చూసినా విదేశీ నిధులు మళ్లీ భారత్‌కు రాక తప్పదు. స్థిరమైన కార్పొరేట్ లాభాలు, ఆర్థిక సంస్కరణలు ఉన్నంత కాలం భారత మార్కెట్ లాంగ్ టర్మ్‌లో పటిష్టంగానే ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News