గోవా గవర్నర్ గా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
హర్యానా గవర్నర్ తో పాటు లడాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ కూడా మార్పు;
మూడు రాష్ట్రాల్లో గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ సోమవారం ఉత్తర్వుల జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గా ఉన్న రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అంగీకరించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు లడఖ్ కు కొత్త లెఫ్ట్నెంట్ గవర్నర్ ని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. లఢాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గా జమ్మూకాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీంద్ర గుప్తాను నియమించారు. అలాగే గోవా రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న పీఎస్శ్రీధరన్ పిళ్ళై ని తొలగించి ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమాన శాఖ మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు. అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ వేత్త. ఇక ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ స్ధానంలో ప్రముఖ విద్యావేత్త, బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అషిమ్ కుమార్ ఘోష్ ని నియమించారు. త్వరలో వీరు ముగ్గురు ఆయా రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకోనున్నారు.